Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: కదులుతున్న కారుపై భారీ చెట్టు పడడంతో బ్యాంక్ మేనేజర్ మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో కెకె నగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వాణి కబిలన్(57) అనే మహిళ తన సోదరి ఎజిలరాసి, డ్రైవర్ కార్తీక్తో సహా మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి శుక్రవారం తన కార్యాలయం నుంచి కారులో తిరిగి వస్తున్నది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను కారు వెనుక సీటులో కూర్చున్నారు. వాహనం లక్ష్మణస్వామి రోడ్డు నుంచి పీటీ రాజన్ రోడ్డు వైపు తిరుగుతుండగా ఓ భారీ చెట్టు కారుపై పడింది. దాంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కారులో ఇరుక్కుపోయారు.
స్థానికులు వెంటనే గమనించి క్షతగాత్రులను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అయితే చెట్టుకింద ఇరుక్కుపోయిన వాణి అక్కడికక్కడే మృతి చెందింది.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించారు. అనంతరం వాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చెన్నైలో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి.