Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చంఢీగఢ్ : అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఐఏఎస్ అధికారి సంజయ్ పొప్లి 27 ఏండ్ల కుమారుడు కార్తిక్ పోప్లి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని ఖండించారు. పోలీసులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని సంజయ్ భార్య ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఐఏఎస్ అధికారి సంజయ్ పొప్లీని జూన్ 21న పంజాబ్ విజిలెన్స్ అరెస్టు చేసింది. మురుగునీటి పైప్లైన్ వేయడానికి టెండర్లను క్లియర్ చేయడానికి బదులుగా లంచం డిమాండ్ చేసినందుకు అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసినట్టు తెలిసింది. విజిలెన్స్ అధికారుల బృందం విచారణ నిమిత్తం చండీగఢ్లోని ఆయన ఇంటికి వెళ్లింది. ఈ సమయంలోనే కాల్పుల శబ్దం వినిపించిందని.. కార్తిక్ తనను తాను కాల్చుకొని చనిపోయాడని అధికారులు చెబుతున్నారు. లైసెన్స్డ్ షాట్గన్తో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు.
దీన్ని సంజయ్ పొప్లి భార్య ఖండించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 'విజిలెన్స్ అధికారులు మాపై ఒత్తిడి చేస్తున్నారు. వారు నమోదు చేసిన కేసుకు మద్దతుగా తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని నా ఇంటి పనిమనిషిని కూడా హింసించారు. నా 27 ఏంకొడుకు చనిపోయాడు. అతను తెలివైన న్యాయవాది.
నాకు న్యాయం కావాలి. నేను కోర్టును ఆశ్రయిస్తాను. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దీనికి సమాధానం చెప్పాలి` అని ఏడుస్తూ చెప్పింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. తన భర్త సంజయ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని ఆ సమయంలో విజిలెన్స్ బృందం తమ ఇంటికి వచ్చిందని తెలిపారు. కార్తిక్ను పైకి తీసుకెళ్లారు. నేను పైకి వెళ్లి చూశా.. కార్తిక్ను మానసికంగా హింసించడం కనిపించిందన్నారు. ఆరోపణలను ఒప్పుకోవాలని హింసించారు... మా ఫోన్లనూ లాగేసుకున్నారు... నా కుమారుడిని గంటలపాటు బంధించారు. ఇప్పుడు కార్తిక్ చనిపోయాడు. సాక్ష్యాలు దొరకకపోతే వీరు ఎవరినైనా చంపేస్తారు.. అని ఆమె ఆరోపించారు.