Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి శనివారం విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం లోని కెనాల్ హెడ్ రెగ్యులేటరీ నుండి స్విచ్ ఆన్ చేసి కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 6.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదన్నారు.
ఈ వానాకాలంలో నిజాంసాగర్ ఆయకట్టులో మొత్తం 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టు ఉన్నదని తెలిపారు.
ఇప్పటికే రైతులు బోర్లు, బావుల క్రింద వరి నారు మళ్ళు పోసుకున్నారని చెప్పారు. కాలువల ద్వారా వదిలిన నీరు నాట్లకు ఉపయోగపడుతుందన్నారు.
మొత్తం 6 విడతలుగా నీరు విడుదల చేస్తామని తెలిపారు. మొదటి విడతలో నీటిని 20 రోజులు వదులుతామని స్పష్టం చేశారు. వానాకాలం సాగుకు 9 టీఎంసీల నీరు అవసరమన్నారు. నీటిని ప్రణాళికాబద్ధంగా విడుదల చేస్తామని తెలిపారు. నీటి విడుదల, ఆయకట్టు అవసరాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. అత్యవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి కొండపోచమ్మ సాగర్ నుండి తెచ్చుకుంటామని తెలిపారు. రైతులు నీటిని వృదా చేయవద్దని సూచించారు. అవసరమైన మేరకే నీటిని విడుదల చేయడానికి, నీటి వృధాను అరికట్టడానికి పర్యవేక్షణ కోసం డిస్ట్రిబ్యూటర్ల వారిగా కాపలా నియమిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ఇరిగేషన్ అధికారుల సాంకేతికత అవసరమన్నారు.
నీటి విడుదలకు అనుమతించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు.