Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగర్తలా: త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు సీపీఐ(ఎం) నేతలను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారంనాడు సీపీఐ(ఎం) నేత, దక్షిణ త్రిపుర జిల్లా పరిషత్ చీఫ్ హిమాన్షు రారు కారుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. దక్షిణ త్రిపురలోని బెలానియాలో జరిగిన ఈ ఘటనలో పోలీసులతో పాటు 28మందికి గాయాలైనట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, ఈ దాడికి పాల్పడింది బీజేపీ కార్యకర్తలేనని హిమాన్షు రారు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హిమాన్షు రారు కుటుంబీకులపై ఇటీవలే కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కాగా, ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేటు దేవప్రియ బర్దన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో హిమాన్షు రారు కారుపై కనీసం 100 మంది దుండగులు రాళ్లతో దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. కాగా, ఈ క్రమంలో పోలీసులు సహా 28 మందికి గాయాలయ్యాయి. గతంలోనూ హిమాన్షు రారు నివాసంపై ఇదే తరహా దాడి జరిగిందని సీపీఐ(ఎం) నేత తపస్ దత్తా తెలిపారు. భయోత్పాతాలను సృష్టించి విపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ యత్నిస్తోందని మరో నేత విమర్శించారు.