Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తామని నల్గొండ జిల్లా ఎస్పీ ఎవీ రంగనాథ్ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఇటీవల లొంగిపోయిన గుర్రంపోడ్ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ జానిబీ అలియాస్ కక్క బుజ్జికి రూ.4లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానిబీ 2004 లో తన 18వ ఏట కనగల్ దళం ఉట్లపల్లికి వచ్చి సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆకర్షితురాలై ఆమె అందులో చేరిందని చెప్పారు. ఆ తరువాత కృష్ణపట్టి దళం, శ్రీకాకుళం జిల్లాలోని కొండ బారుడి (గొట్ట) దళం, ఒర్రిస్సా లోని నారాయణ పట్నం దళం, మల్కన్ గిరి జిల్లాలోని గుమ్మ దళంలో పనిచేసిందన్నారు. ప్రస్తుతము ఆమె గ్యాస్ ట్రబుల్, మలేరియా తదితర అనారోగ్య సమస్యల వల్ల మావోయిస్ట్ ఉద్యమం నుండి ఈ ఏడాది ఆగస్టు 7న తమ ముందు లొంగిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము తరపున ఆమెకు రావలిసిన రివార్డ్ 4.00 లక్షలు అందజేసినట్టు చెప్పారు. మావోయిస్టుల ప్రాబల్యం నల్గొండ జిల్లాలో పూర్తిగా పోయిందని లొంగిపోయిన మావోయిస్టులకు వారి పేరున ఉన్న రివార్డ్ లను అందించడం తో పాటు వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రశాంతంగా జీవించేలా అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. జానిబీ తనకు వచ్చిన నాలుగు లక్షల రూపాయలను సద్వినియోగం చేసుకోవాలని, జీవితంలో స్థిరపడే విధంగా వినియోగించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమములో జిల్లా అదనపు ఎస్పీ టి.పద్మనాభ రెడ్డి, ఆర్.ఐ. శంకర్, గుర్రంపోడు ఎస్.ఐ. క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.