Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇటీవల ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ఇండియాలో పర్యటించిన వేళ, బ్రాహ్మణులను కించపరిచారంటూ దాఖలైన కేసులో, ఆయనను అరెస్ట్ చేయవద్దని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసేందుకు మాత్రం నిరాకరించింది. ఆయన పట్టుకున్న ఓ ప్లకార్డు తీవ్ర వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. బ్రాహ్మణ పితృస్వామ్య వ్యవస్థను నాశనం చేయాలన్న అర్థం వచ్చేలా ఈ ప్లకార్డు ఉండటంతో విమర్శలు చెలరేగాయి. దీనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
ఇండియాకు వెళ్లి ప్రజల మధ్య వైరాలు పెట్టి వచ్చారని డోర్సీపై విమర్శలు వెల్లువెత్తగా, ఆయన స్వయంగా క్షమాపణలు కూడా చెప్పారు. తన కార్యక్రమానికి వచ్చిన ఓ దళిత కార్యకర్త తనకు ఆ ప్లకార్డును ఇచ్చారని వివరణ ఇచ్చారు. ఆపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, అమెరికా పౌరుడైన అతన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని, తమ ఆదేశాలు తదుపరి ఉత్తర్వుల వరకూ అమలులో ఉంటాయని, ఈ కేసును అతని న్యాయవాది లేదా ప్రతినిధి సమక్షంలో విచారించ వచ్చని కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో జాక్ డోర్సీ తరఫున న్యాయవాది ముక్తేష్ మహేశ్వరి హాజరయ్యారు.