Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షో వల్ల క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కెరీర్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. షోలో ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల వీరిద్దరిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సస్పెండ్ చేసింది. విమర్శల కారణంగా పాండ్య కనీసం ఇంట్లో నుంచి బయటికి రావడం లేదని ఆయన తండ్రి ఇటీవల మీడియాతో అన్నారు. ఇప్పటికే ఇద్దరు క్రికెటర్లు బీసీసీఐను క్షమాపణలు కోరారు. ఈ కేసును విచారించేందుకు సుప్రీం కోర్టు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కాగా పాండ్య, రాహుల్ను సస్పెండ్ చేయడం పై కరణ్ స్పందించారు. 'అది నా షో కాబట్టి నేను బాధ్యతాయుతంగానే ప్రవర్తించాను. అది నా ప్లాట్ఫాం. నేను వారిని (పాండ్య, రాహుల్) అతిథులుగా ఆహ్వానించాను. కాబట్టి నా షోలో జరిగే పరిణామాలకు నేను బాధ్యత వహించాలి. ఈ ఘటన వల్ల నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇలాంటి నష్టం నా వల్ల ఎలా జరిగిందని బాధపడ్డాను. కానీ నా మాట ఎవరు వింటారు? ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోయింది' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.