Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు న్యాయం కోసం దీక్ష చేసిన వేదిక (ఏపీ భవన్) నుంచే మరోసారి చంద్రబాబు దీక్ష చేపట్టారు. నల్లచొక్కాతో దీక్షకు హాజరయ్యారు. అంతకు ముందు ఏపీ భవన్లో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం దీక్షా వేదికపై గాంధీ, అంబేడ్కర్, ఎన్టీఆర్ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ దీక్షకు ఏపీ నుంచి వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు పలు జాతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. వివిధ తెలుగు సంఘాలు, విద్యార్థి సంఘాలు దీక్షకు మద్దతు పలికాయి. దీక్ష ప్రారంభమైన అనంతరం చంద్రబాబుకు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిందని, ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందేనని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తామని తెలిపారు. చంద్రబాబు దీక్షపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడాలని అన్నారు. ఏపీ ప్రజలకిచ్చిన హామీలను మోడీ విస్మరించారన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారని దుయ్యబట్టారు. ప్రధానికి విశ్వసనీయత లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ఏపీ ప్రజల సొమ్మును దోచి అంబానీకి కట్టబెట్టారన్నారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు. దీక్షకు పలువురు జాతీయ నాయకులు మద్దతు ప్రకటించారు. వారిలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, జైరాం రమేష్ , శరద్ యాదవ్, తృణముల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఒబ్రెయిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్ తదితర నేతలు మద్దతు తెలిపారు.