Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు 4జీ సేవలకు అనువైన తరంగాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ చెబుతున్నది. ఈ రెండు సంస్థలకు 4జీ స్పెక్ట్రం కేటాయించాలని ట్రాయ్కి సిఫార్సు చేసినట్లు గత నెల టెలికం శాఖ (డీవోటీ) చెప్పిన నేపథ్యంలో ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ , మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్లకు 4జీ సేవల సౌకర్యం కల్పించాలని డీవోటీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ట్రాయ్కి చెప్పామని డీవోటీ చెబుతుండగా, అదేమీ లేదని ట్రాయ్ ఖండిస్తున్నది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుపై డీవోటీ నుంచి మాకు ఎలాంటి సిఫార్సులు అందలేదు అని సదరు అధికారి ఓ ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రికతో అన్నారు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 4జీ సేవల్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. 4జీ అనుమతిలేని ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం వీటితో పోటీపడలేక నష్టాల్లో కూరుకుపోతున్నాయి. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రుణం భారం రూ.35,000 కోట్లపైనే. ఉద్యోగులకు జీతాలను కూడా చెల్లించలేని దుస్థితిలో ఈ సంస్థలున్న సంగతీ విదితమే.