Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో ఘోర బాంబు పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 100 తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు దాదాపు 1000 మంది వరకు హాజరైనట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పేలుడు తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం జరిగిన ఉగ్రదాడుల్లో ఇదే అతిపెద్దది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. వివాహ వేడుకకు హాజరైన అతిథులు గుంపులుగా ఉన్న సమయంలో దుండగుడు ఆత్మాహుతికి పాల్పడినట్లు తెలుస్తోందని అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నుష్రత్ రహీమీ తెలిపారు. పెళ్లి వేదికపై సంగీత బృందం ప్రదర్శన ఇస్తున్న సమయంలో అతిథులంతా అక్కడ గుమిగూడారని, ఆ సమయంలో దుండగుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మృతుల సంఖ్యపై అక్కడి ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు దాడికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించనప్పటికీ.. స్థానిక ఇస్లాం ఉగ్రముఠాలతో కలిసి తాలిబన్లే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.