Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించి కావాలనే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వరద ముంపు బాధితులను మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని.. వీటిలో మౌలిక వసతులకోసం భూమిని కేటాయించిన తర్వాత ఇంకా 8 వేల ఎకరాల వరకు మిగులుతుందని చెప్పారు. ఆ భూమి అమ్మినా ఖర్చు లేకుండా రాజధానిని నిర్మించుకోవచ్చని చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలు నిలిచిపోయాయని ఆయన విమర్శించారు. రాజధానిని మార్చాలనే కుట్రతోనే ముంపుప్రాంతం అంటూ చర్చ లేవనెత్తుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిపై మంత్రి బొత్స దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. వైకాపా కుయుక్తులపై ఎంతవరకైనా వెళ్తామన్నారు. పట్టిసీమతో అవనిగడ్డ ప్రాంతంలో వాణిజ్య పంటలకు నీరిచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.