Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : చెన్నై సమీపంలో రెండో విమానాశ్రయం నిర్మించేందుకు అనువైన ఆరు స్థలాలు వున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మీనంబాక్కంలో వున్న జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల విస్తరణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో విమానయాన సర్వీసులను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ఇటీవలి కాలంలో చెన్నై నగరానికి దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగటంతో కనీసం చెన్నైకి సమీపంలోనైనా రెండో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. రెండో విమానాశ్రయం ఏర్పాటుకు రెండువేల నుంచి 2500 ఎకరాల విస్తీర్ణం గల భూములు అవసరమ వుతాయి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం నెలకొల్పేందుకు అనువుగా ఉన్న ఆరు స్థలాలను ఎంపిక చేసింది. వీటిలో ఒక ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపిక చేయాల్సి వుంటుంది. కాంచీపురం జిల్లాలోని తిరెప్పోరూరు, దోతూరు, మదురమంగలం, తిరువళ్లూరు జిల్లా మప్పేడు, వేలూరు జిల్లా వలత్తూరు, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు ప్రాంతాలు విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా ఉన్నాయి. చెన్నై విమానాశ్రయం నుంచి తిరుప్పోరూరు 40 కి.మీ. దూరం లోను, మప్పేడు 46 కి.మీ.లు, వలత్తూరు 70 కి.మీ.లు, సెయ్యారు 90 కి.మీ.లు, దోతూరు 55 కి.మీ.లు, మదురమంగళం 55కి.మీల దూరంలోను వున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న విమానాశ్రయ విస్తరణ పనులు రెండేళ్లలో పూర్తవుతాయి.
2021లో ఈ ఆరు ప్రాంతాల్లో ఒకదానిని ఎంపిక చేసి కొత్త విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఈ కొత్త విమానాశ్రయాన్ని కాంచీపురం లేదా తిరువళ్లూరు జిల్లాలో నిర్మిస్తే సమంజసంగా వుంటుందని అధికారులు భావిస్తున్నారు.