Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కోవిడ్–19 నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి నిరసన సెగ తగిలింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా ప్రభుత్వం, వైద్య ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, ఏఐటీయూసీ ప్రతినిధులతోపాటు గాంధీ సిబ్బంది జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల రెగ్యులరైజ్ ప్రధాన డిమాండ్తో పాటు సమాన పనికి సమాన వేతనం నినాదంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. ఇదిలాఉండగా మంగళవారం ఉదయం నుంచి ఆందోళనకారులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆస్పత్రి లోపల, బయట తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 212 మంది నర్సింగ్ సిబ్బంది గత 5 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.