Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరదలో రామంతాపూర్ ఈఎస్ఐ డిస్పెన్సరీ...
- పట్టించుకోని హబ్సిగూడ డిస్పెన్సరీ వైద్యులు
- గంటల తరబడి క్యూలో నిల్చుంటే మందులు లేకపాయే
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నగరం ఇంకా కోలుకోవడం లేదు. వర్ష బీభత్సానికి నీట మునిగిన పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టినా 60కిపైగా కాల నీలు ఇంకా పూర్తిస్థాయిలో తేరుకోలేదు. వరదకు రోడ్లు దెబ్బతిని గుంతల మయం అవగా, వీధులన్నీ బురదతో నిండిపోయాయి. దాంతో బాధితులు నానా అవస్తలు పడుతున్నారు. దీనికితోడు వరద, మురుగునీటి వల్ల ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయని, దీనివల్ల అంటువ్యాధులు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా వరద బీభత్సానికి రామంతాపూర్ పెద్ద చెరువు పరిసరాల్లో కాలనీలు ఇంకా కోలుకోలేదు. బురదలోనే ఉండిపోయాయి. ఈ క్రమంలో రామంతాపూర్కు చెందిన ఈఎస్ఐకి ఆస్పత్రి డిస్పెన్సరీ హబ్సీగూడా స్ట్రీట్ నంబర్ 8లోని ఉంది. దాంతో డిస్పెన్సరీ సైతం వరదల్లో మునిగిపోవడంతో అప్పటి నుంచి డిస్పెన్సరీ మూసేశారు. రోజులతరబడి డిస్పెన్సరీ మూసివేడంతో రోగులు నానా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది. రామంతాపూర్ డిస్పెన్సరీకి ప్రతి రోజు వందలాది మంది రోగులు వచ్చి మందులను తీసుకుంటారు. మరికొందరు నాచారం ఆస్పత్రికి రెఫర్ చేయించు కుంటారు. అయితే డిస్పెన్సరీ మూసి వుండడంతో ఎక్కడి వెళ్లాలో తెలియకర రోగులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు మాత్రం హబ్సీగూడలోని డిస్పెన్సరీకి వెళ్తున్నారు. అలా వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. రెండు డిస్పెన్సరీల రోగులు రావడంతో అక్కడి సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదు. రామంతాపూర్ డిస్పెన్సరీ వారుగానీ, పై అధికారులు గానీ మాకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులివ్వలేదని అక్కడి సిబ్బంది కటువుగా సమాధానమిస్తున్నారు. రామంతాపూర్ డిస్పెన్సరీ ఉద్యోగులు గత 10రోజులుగా ఇంట్లో వుంటే మేమే మాత్రమే పనిచేయాలా అంటూ చిరాకు పడుతున్నారు.
స్టాక్ లేదు... ఉన్నా మూడు రోజులకే...
ప్రతినెలా రోగులు డిస్పెన్సరీలో మందులు తీసుకుంటారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాడ్తో పాటు తదితర రోగులు ప్రతినెలా క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గత 12రోజులకుపైగా రామంతాపూర్ డిస్పెన్సనీ మూసివేడం తో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. హబ్సిగూడ డిస్పెన్సరీకి వెళ్లిన మహిళలు, వృద్ధులు నానా అవస్తులు పడుతున్నారు. క్యూలైన్ అధికంగా ఉండడంతో వెరిఫికేషన్కు ఒక లైన్ కట్టాల్సి వస్తోంది. ఆ తర్వాత స్టాపింగ్ వేయించుకోవాలి, అనంతరం డాక్టర్ను సంప్రదించాలి. అక్కడి నుంచి మరో క్యూ లైన్లో వైద్య పరీక్షలు(బీపీ, షుగర్) చేయించుకోవాలి. ఆ తర్వాత తిరిగి డాక్టర్ను సంప్రదించాలి, అప్పటిగానీ వైద్యులు చీటీపై మందులు రాయరు. అప్పటికే గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తీరా మందుల చీటీ పట్టుకొని కౌంటర్ వద్దకు వెళ్తే స్టాక్ లేదని సమాధానమిస్తున్నారు. స్టాకున్న రామంతాపూర్ డిస్పెన్సరీకి చెందిన వారికి మాత్రం మూడు రోజులకు సరిపడే మందులను ఇచ్చి పంపిస్తున్నారు. దాంతో పలువురు రోగులు ఆందోళన చెందుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చుంటే మందులివ్వరేమని ప్రశ్నిస్తే మాత్రం అక్కడి సిబ్బంది కటువుగా సమాధానమిస్తున్నారు.
మందులు కొనే పరిస్థితి లేదు
చాలీచాలని వేతనాలతో బతుకు ఈడుస్తున్న కార్మికులు, చిరుఉద్యోగుల కుటుంబాలకు బయట మందులు కొనే పరిస్థితి లేదు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి మందులు అందుబాటులో లేకపోవడంతో నానా అవస్థులు పడుతున్నారు. క్రమం తప్పకుండా మందులు వాడకపోతే ప్రాణాల మీదకు వచ్చే అవకాశమంది. ఇలాంటి పరిస్థితుల్లో డిస్పెన్సరీలో అవరమైన మందులు లేకపోవడం ఆందోళనక కరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని రోగులు కోరుతున్నారు.