Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపూర్ణ స్వాతంత్య్ర ఎజెండా కమ్యూనిస్టుల ఘనతే
- 'కమ్యూనిస్టు ఉద్యమం 100 ఏండ్ల ప్రస్థానం'
- సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెట్టుబడిదారి వ్యవస్థలో ధనికులు, పేదలు పెరిగారని, పేదరికాన్ని ఎదుర్కొవడంతో పాటు ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాలకు పరిష్కారం చూపించే దమ్ము ఎర్రజెండాకు మాత్రమే ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం పార్టీ హైదరాబాద్ నగర ప్రథమ కార్యదర్శి ఎన్వీ భాస్కర్రావు వర్ధంతి సందర్భంగా గోల్కొండ క్రాస్రోడ్డులోని పార్టీ కార్యాలయంలో 'కమ్యూనిస్టు ఉద్యమం 100 ఏండ్ల ప్రస్థానం'పై సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో తమ్మినేని మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా సోషలిజం, సామ్రాజ్య శక్తులకు మధ్య ఘర్షణ పెరిగిందనీ, ఈ యుద్ధంలో ఎర్రజెండా నిలవడం, గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కరోనాకు పరిష్కారం వెతక్కుండా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడం కష్టమని, కరోనాను ఎదుర్కొన్న చైనా, క్యూబా, వియ్నతం దేశాలు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డాయని గుర్తు చేశారు. చైనాలో కరోనా తగ్గడంతో పర్యాటక రంగం 70శాతం పెరిగిందని, కరోనా కారణంగా హైదరాబాద్ మెట్రోరైలులో ప్రయాణికులు ఎక్కడానికి భయపడుతున్నారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎర్రజెండా పని అయిపోయిందని బల్లగుద్ది చెప్పిన మేధావులు 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ ఎర్రజెండావైపు చూస్తున్నారన్నారు. కమ్యూనిజాన్ని అధ్యయనం చేసేందుకు భారతదేశం నుంచి విప్లవకారులు రష్యాకు వెళ్లారనీ, అక్కడ జరిగిన విషయాలు తెలుసుకుని, నేర్చుకుని, చర్చలు జరిపి 1920లో భారత కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్య్రం ఎజెండాను లేవనెత్తిన ఘతన కమ్యూనిస్టులదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం భారతీయులకు ఉద్యోగాలు, పరిశ్రమలు, చదువులు, వ్యాపారాల్లో అవకాశాలు కావాలని అడిగారనీ, స్వాతంత్య్రం డిమాండ్ పెట్టలేదని చెప్పారు. కమ్యూనిస్టుల ఒత్తిడితోనే 1929లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, బెంగాల్లో తెబాగ పోరాటం, కేరళలో పున్నపవాయిలార్ పోరాటాలు జరిగాయని, పోరాటాల ఫలితంగానే కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు అధికారంలో కొచ్చారని గుర్తు చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎలా ఉండాలో కమ్యూనిస్టులు డిజైన్ చేశారనీ, కానీ కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదన్నారు. ఓటు విషయంలో సమానంగా చూశారు గాని ఓటేసిన మనిషిని మాత్రం సమానం గా చూడలేదన్నారు. భూమిని జాతీయం చేయకుండా, దున్నేవాడికి భూమి ఇవ్వకుండా ఆర్థికాభివృద్ధి జరగదని తెలిపారు. 100ఏండ్ల చరిత్రలో ఎంతో మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని, పోరాటాలు, ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. భారత్-చైనా విషయంలో భారతప్రభుత్వ వైఖరిని సీపీఐ(ఎం) సమర్థిస్తోందని, ఏమైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు డీజీ నరసింహారావు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో సీపీఐ(ఎం) నిర్మాణంలో ఎన్వీభాస్కర్ కృషి మరువలేని దన్నారు. నగరంలో విద్యార్థి, కార్మిక ఉద్యమాలతోనే పార్టీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అంతకుముందు ఎన్వీ.భాస్కర్ రావు చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్రావు, ఎం.దశరథ్, ఎం.వెంకటేష్, అరుణజ్యోతి పాల్గొన్నారు.