Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు జయంతి
నవతెలంగాణ-హైదరాబాద్
చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు ముంచిన భార్యాభర్తల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు మట్ట జయంతి కోరారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు ప్రతాప్ రెడ్డి, జ్ఞానేశ్వర్, వీరాస్వామి, సుబ్బారెడ్డి లతో కలిసి ఆమె మాట్లాడారు. నగరంలోని గాజుల రామారం, ఉషోదయకాలనీకి చెందిన నిర్మలారెడ్డి, సుదర్శన్ రెడ్డి భార్యాభర్తలిద్దరు కలిసి చిట్టీల పేరుతో వందలాది మంది వద్ద సుమారు రూ.10 కోట్ల మేరకు దగాకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ కూతుళ్ల వివాహాలు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణాల కోసం పైసా పైసా కూడబెట్టి చిట్టీల పేరుతో వారి వద్ద పొదుపు చేస్తే నిండా ముంచారని వాపోయారు. ఇదే విషయమై జగద్దిరిగుట్ట పోలీసులను ఆశ్రయించగా వారు నిందితుల పక్షాన నిలుస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని, అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈవిషయంలో ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.