Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిక్కడపల్లి నుంచి 'పోరు యాత్ర' ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అవి అమలైతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీఐటీయూ రాష్ట్ర నాయకులు జె.వెంకటేశ్ అన్నారు. సీఐటీయూ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీపు జాతాను బుధవారం చిక్కడపల్లిలోని లేబర్ అడ్డావద్ద ప్రొ. నాగేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలు, హైదరాబాద్లో 3 లక్షల మంది కార్మికులు ఉన్నారని, వీరికి పనుల్లేకుండా పోయాయని తెలిపారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో రూ.1200 కోట్లు మూలుగుతున్నాయని, వాటిని ఏం చేస్తారని ప్రశ్నించారు. కార్మికులకు వారంలో రెండు రోజులు పనులు దొరికితే మిగతా మూడు రోజులు ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కేంద్రంలో మోడీ ఐదేండ్లు అధికారంలో ఉన్నా.. బీజేపీకి ఇంకా అధికార దాహం తీరలేదని విమర్శించారు. ప్రస్తుతం రైతులు పెద్ద కష్టాల్లో ఉన్నారని తెలిపారు. రైతులు దివాలా తీస్తే దేశానికే నష్టమని చెప్పారు. కొత్త మూడు చట్టాలు అమల్లోకి వస్తే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమనీ, తిండి గింజలు కూడా దొరకవని చెప్పారు. సీఐటీయూ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు ఈశ్వర్రావు మాట్లాడుతూ బీజేపీ కార్మికవ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. వ్యవసాయం, రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంపై పెద్దఎత్తున పోరాటం చేస్తామన్నారు. 8గంటల పనిదినాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు పి.శ్రీకాంత్, పద్మశ్రీ, నగర్ కార్యదర్శి ఎం.వెంకటేష్, ఆఫీస్ బేరర్, జె.కుమారస్వామి, కె.రమేష్, ఆర్.మల్లేష్, ఎం.సత్యనారాయణ, నాయకులు, జాకీర్, జి.రాములు, శ్రీరాములు, పి.వెంకటయ్య సి.మల్లయ్య, కె.రాజునాయక్, తదితరులు పాల్గొన్నారు.