Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి సోమయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారతదేశంలో అనాదిగా వేళ్ళూనుకున్న మనువాద భావజాల సిద్ధాంతానికి భిన్నంగా ఆర్థిక, రాజకీయ, సాంఘిక విషయాలలో అనేక మార్పులు తెచ్చిన సామాజిక విప్లవకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని సీపీఐ(ఎం) పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ కార్యదర్శి సోమయ్య అన్నారు. బుధవారం అంబేద్కర్ 130జయంతి సందర్భంగా జంగంమేట్లో బేడా బుడగ జంగం కమ్యూనిటీ హల్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక విద్యా స్థాపన కోసం కృషి చేశారని, చదువుకుంటే బతకగలం.. భవిష్యత్తును జయించగలమని అనాడే చెప్పారన్నారు. తను చిన్ననాటి నుంచి అనేక రకాలుగా కుల వివక్షను ఎదుర్కొన్నారని, ఎన్ని ఆటంకాలొచ్చినా వెనుకడుగు వేయకుండా నిమ్న జాతుల కోసం తన కుటుంబాన్ని, జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అని అన్నారు. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో నిలబడాలని, దాని కోసం ప్రజలను సమీకరించు, బోధించు, పోరాడు, పోరాట మార్గ్గమే శరణ్యమన్నారు. నేడు దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కుట్రలను అరికట్టాలన్నారు. మనిషిని మనిషిగా చూడలేని అశాస్త్రీయమైన మనుధర్మ విధానాలను మళ్లీ ముందుకు తీసుకువస్తుందన్నారు. ఇటీవలి కాలంలో దళిత, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై వరుస దాడులతో సమాజం ఎటుపోతోందోనన్నారు. పాలకులు అంబేద్కర్ విగ్రహాలను పెట్టి దండలేడయం కాదని.. నిజమైన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు. భిన్న కులాలు, మతాలు, సంస్కృతులు, జాతులు ఉన్నా ఈ దేశంలో ప్రతి ఒక్కరినీ గౌరవించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సీపీఐ(ఎం) నాయకులు కోటయ్య, కిషన్, కృష్ణ నాయక్, శ్రీను, నగేష్, మహేష్, నవీన్ ఆంజనేయులు, వినోద్ చంద్ర, మురారి, శ్రీనివాస్ పాల్గొన్నారు.