Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేళ్లుగా నయా పైసాలేదు
- కేంద్రం విదిల్చినా ఖర్చు లేదు
- ఇదీ జిహెచ్ఎంసి తీరు
- పేదల అభివృద్ధి పట్టదా?
మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న జిహెచ్ఎంసి లక్ష్యం నీరు గారిపోతోంది. ఐదేళ్ల క్రితం ఈ పథకాన్ని రూపొందించారు. అందుకు అనుగుణంగా నిధుల కోసం ప్రయత్నించారు. కాని గడువు తీరినా చేపట్టాల్సిన అభివృద్ధి మాత్రం జరగలేదు. పేదలు నివసించే ప్రాంతాలను తీర్చిదిద్దుతామన్న వారి లక్ష్యం నెరవేరలేదు.
నవతెలంగాణ, సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మురికివాడలులేని నగరంగా చేయాలనే లక్ష్యం తుంగలో కలిసింది. జిహెచ్ఎంసి తయారు చేసిన బృహత్ ప్రణాళిక చెత్త బుట్ట పాలైంది. ఐదేళ్ల కాలంలో నయాపైసా నగరంలోని మురికివాడల అభివృద్ధికి ఖర్చు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి, జిహెచ్ఎంసి అధికారులకు మనసొప్పలేదు. మురికివాడలన్నా, అక్కడి ప్రజలన్నా పాలకులు, అధికారులకు అలుసున్నట్లుంది. మురికివాడలు అభివృద్ధి చేయకుండా విశ్వనగరంగా హైదరాబాద్ సాధ్యమవుతుందా... లక్షల మంది నివసించే నగర మురికివాడల్లో జిహెచ్ఎంసి నయాపైసా ఖర్చు చేయలేదనే విషయాన్ని నమ్మలేకపోతున్నారా.. అయితే నవతెలంగాణ ప్రత్యేక కథనం చదవాల్సిందే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1476 మురికివాడలున్నాయి. ఈ మురికివాడల్లో దళితులు, గిరిజనులు, అణగారిన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇందులో అత్యధికులు ఉపాధి కోసం నగరానికి వలస వచ్చిన వారే ఉన్నారు. మరికొంతమంది తరతరాలుగా ఇదే మురికికూపాల్లో బతుకు బండి లాగుతున్నవారు ఉన్నారు. సుమారు 30లక్షల మంది ఈ మురికివాడల్లో నివసిస్తున్నారు. వీరికి కనీస సౌకర్యాలు ఇళ్లు, తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ సౌకర్యాలు కరువయ్యాయి. అయితే నగరంలోని 1476 మురికివాడల అభివృద్ధి కోసం 2010లో జిహెచ్ఎంసి ఒక బృహత్ ప్రణాళిక తయారు చేసింది. ఇందులో కొన్ని మురికివాడలను ఎంపిక చేసి వాటిలో గృహవసతి, రోడ్లు, మంచినీరు, డ్రెయినేజీ, వీధిదీపాల వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2010 డిసెంబర్ 22న జిహెచ్ఎంసి పాలకమండలి 108వ తీర్మానం ద్వారా మురికివాడలులేని నగరంగా అభివృద్ధి చేసే ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఇందుకనుగుణంగా ఐదు సంవత్సరాలలో చేపట్టే పనులు వాటికి అయ్యే ఖర్చు వివరిస్తూ ప్రణాళిక చేశారు.
ఎంపిక చేసిన మురికివాడలు కావాల్సిన నిధులు
2011-12 290 2292కోట్లు
2012-13 299 2175కోట్లు
2013-14 299 2587కోట్లు
2014-15 299 2598కోట్లు
2015-16 289 2079కోట్లు
ఇతర ఖర్చులు ... 769కోట్లు
మొత్తం 1476మురివాడలు 12,500కోట్లు
ఈ ప్రణాళిక ప్రకారం రూ.12,500కోట్లతో 2016 సంవత్సరం నాటికి హైదరాబాద్ నగరాన్ని మురికివాడలు లేని నగరంగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యం.
అయితే 2011-12 సంవత్సరానికి కొన్ని పనులతో 290 మురికివాడలలో రూ.545కోట్లతో ఒక ప్రణాళిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఈ ప్రణాళికలో పూర్తి వివరాలు లేవని, మొదటగా రెండు మురికివాడలను పైలెట్ ప్రాజెక్టు కింద అన్ని పనులు చేపట్టే విధంగా ప్రణాళిక పంపాలని కేంద్ర ప్రభుత్వం అడిగింది. ఇందుకనుగుణంగా కేశవనగర్ మురికివాడలను అభివృద్ధి చేయడానికి రూ.59కోట్లతో ప్రణాళికను కేంద్రానికి పంపగా దానికి ఆమోద ముద్రవేసి బడ్జెట్ విడుదలయ్యింది.
ఇదీ జిహెచ్ఎంసి తీరు
1476 మురికివాడల అభివృద్ధి కోసం 2011 నుంచి 2014 వరకు నయాపైసా జిహెచ్ఎంసి ఖర్చు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రూ.59కోట్లను విడుదల చేస్తే రెండు మురికివాడల్లోనే కేవలం రూ.9,82,457 ఖర్చు చేసింది. కేశవనగర్, ఐడిహెచ్ కాలనీలలో మాత్రమే 2014-15 సంవత్సరంలో కొన్ని పనులు చేపట్టారు. అయితే 2010 సంవత్సరం చివరిలో జిహెచ్ఎంసి పాలకమండలి తయారు చేసిన బృహత్ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను మాత్రమే కేంద్రానికి పంపారు. మిగతా నాలుగు సంవత్సరాల్లో మురికివాడలను అభివృద్ధి చేయాలనే ప్రణాళికను పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదనేది స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం 2011-12 సంవత్సరానికి నిధులు కేటాయిస్తే 2014-15లో ఖర్చు చేశారు. అవి కూడా నామమాత్రంగా ఉండటం గమనార్హం.