Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌకర్యాలు కల్పిస్తామని హామీ
-15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆదేశం
నవతెలంగాణ - సిటీబ్యూరో
లోధా నిర్మాణ సంస్థ యాజమాన్యం దిగొచ్చింది. బెలేజ, మెరిడీయన్ అపార్ట్మెంట్ నివాసితులకు అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తామని హామీనిచ్చింది. మౌలిక వసతులు, ఖాళీస్థలాన్ని కేటాయిస్తామని అంగీకరించింది. పార్కింగ్ సమస్య మాత్ర కొలిక్కిరాలేదు. ఈ మూడు అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని లోధా ప్రతినిధులను కమిషనర్ జనార్దన్రెడ్డి ఆదేశించారు. బెలేజ, మెరిడీయన్ అపార్ట్మెంట్ల మధ్య ఉన్న పార్కింగ్, ఇతర అంశాలపై లోధా యాజమాన్య ప్రతినిధులు, ఫ్లాట్స్ యజమానులతో కమిషనర్ మంగళవారం సమావేశమయ్యారు. లోధా నిర్మాణ సంస్థ నిబంధనలను అతిక్రమించిందని, ఒప్పందంలో పేర్కొన్న విధంగా తగు పార్కింగ్, రిక్రియేషన్ స్థలాన్ని వదలడం లేదని పేర్కొంటూ నగరంలోని కేపీహెచ్బీలో గల బెలేజ, మెరిడీయన్ అపార్ట్మెంట్ నివాసితులు జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్రెడ్డిని ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ మేరకు విచారణ జరిపిన జీహెచ్ఎంసీ కమిషనర్ పదిరోజుల క్రితం లోధా నిర్మాణ సంస్థ ప్రతినిధులతో, బెలేజ, మెరిడీయన్ అపార్ట్మెంట్ నివాసితులతో చర్చలు జరిపారు. పదిరోజుల్లోగా పూర్తి స్థాయి వివరణ అందించాలని లోధా నిర్మాణ సంస్థ యాజమాన్యానికి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి ఆదేశించారు. దీంతో లోధా నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఎదుట జరిగిన విచారణకు హాజరయ్యారు. బెలేజ, మెరిడీయన్ అపార్ట్మెంట్ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమి షనర్ ఇరు పక్షాలతో సమావేశం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ జీహెచ్ఎంసీ జారీచేసిన అనుమతులను అనుసరించి కల్పించిన సౌకర్యాలను తెలియజేస్తూ వివరాలను 15రోజుల్లోగా అంద జేయాలని సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ దేవేంద ర్రెడ్డి, శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.