Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎన్.రెడ్డి
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా విస్మరిస్తోందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎన్.రెడ్డి అన్నారు. మంగళవారం కుషాయిగూడ డిపో ఆవరణలోని జ్యోతిగార్డెన్లో మల్కాజిగిరి, ఉప్పల్ ప్రాంతీయ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఐపీఎస్ 1995 పెన్షనర్లు, రిటైర్డ్ పర్సన్స్ ప్రాంతీయ సదస్సుల్లో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారం లోకి రాకముందు పెన్షన్ పెంచి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. కనీస పెన్షన్లు నిర్ధారణ, కరువు భత్యం చెల్లించుట, నిర్ణీత గడువులో పెన్షన్ సౌకర్యంతో పాటు ఉపసంహరించిన ప్రయోజనాలు, వైద్య వసతులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాన్ని, ట్రాన్స్పోర్టు సౌకర్యాన్ని కల్పించడంలేదని తెలిపారు. ఎంప్లాయిస్ జీతాల నుంచి 40వేల కోట్లు ప్రభుత్వం వసూళ్ళు చేసిన తర్వాత ఐపీఎస్ 1995 ప్రకారంగా చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. కేరళ కోర్టు తీర్పును ఐపీఎస్ పెన్షనర్లందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలు అధికారులు ,కార్మిక వేతనాలు జనవరి 1న సవరణ చేశారని , అధికారాల వేతనాల సవరణలకు జస్టీస్ సతీష్చంద్ర ఆధ్వర్యంలో ఏర్పడ్డ మూడో వేతరణ సవరణ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేసిందని ఆయన తెలిపారు. ఐపీఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించు కునేందుకు పోరాటం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రాంతీయ కమిటీ ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి, మల్కాజిగిరి ప్రాంతీయ అధ్యక్షకార్యదర్శులు బాలయ్య, కృపాసాగర్, నాయకులు జెవిరెడ్డి, చంద్రయ్య, ప్రసాద్, సన్నయ్య పాల్గొన్నారు.