Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
మీడియా, ఉన్నత విద్య, రాజకీయాలు ప్రగతికి సోపానాలని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. మంగళవారం ఓయూ సీఐపీ హాల్లో ఓయూ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ (ఓయూ సీఐపీ), ఐసీఎస్ఎస్ఆర్ (సౌత్ రీజియన్) వారి సంయుక్త ఆధ్వర్యంలో 'మీడియా, ఉన్నత విద్య, రాజకీయాలు' అనే అంశంపై రెండురోజుల జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి మరింత సమాచారం తెలుస్తుందన్నారు. మీడియా వల్ల ప్రభుత్వ సంస్కరణలు, పథకాలు, నూతన పాలసీలు ప్రజలకు తెలుస్తాయన్నారు. మీడియా ద్వారా విద్యారంగానికి సంబంధించిన సమాచారం సైతం అందుబాటులోకి వస్తుందని, నేడు మీడియా పలు ప్రాంతీయ భాషల్లో విస్తరించి విశేష సేవలందిస్తోందని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్ ద్వారా అన్ని విషయాలు కండ్లముందే తెలుస్తున్నాయని, ఈ మూడు రంగాలు దేశ పురోగతి, ఉన్నతిని తెలియజేస్తాయని చెప్పారు. విద్య అన్నివర్గాలకు మరింత చేరువకావాలన్నారు. అనంతరం భారతీయ ప్రజ్ఞ ఎడిటర్ డాక్టర్ టి.హనుమాన్ చౌదరి మాట్లాడుతూ మన దేశంలో ఉన్నత విద్య మరింత వృద్ధి సాధించాలని తెలిపారు. విద్య, స్కిల్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతోందని, ఐటీ రంగాలు మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్ ఎం.చెన్నబసవయ్య, సిప్ డైరెక్టర్ ఎ.కరుణాకర్, డాక్టర్ కొండా నాగేశ్వరావు పాల్గొన్నారు.