Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడి గోడల కూల్చివేత.. స్థానికుల ఆందోళన
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
లాలాపేటలో ప్రభుత్వ స్థలాలో ఉన్న గడి గోడలను కూల్చివేసి ఆక్రమించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ సికింద్రాబాద్ నియోజక వర్గ ఇన్చార్జి అన్నం వీరేశ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం లాలాపేటలో తోట ప్రాంతం లోని ఓ అపార్ట్మెంట్ వ్యక్తి గడిగోడను పూర్తిగా కూల్చివేసి ప్రహారి గోడను నిర్మించేందుకు యత్నించాడు. ఈ మేరకు సీపీఐ పనులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరేశ్ మాట్లాడుతూ లాలాపేటలో పురాతమైన గడి గోడలను ప్రయివేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా కూల్చివేసి ఆ స్థలాలను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. ఈ విషయమై పురావస్తు శాఖ, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూముల్లో ఉన్న గడి గోడలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్కు కార్యదర్శి క్రిష్ణమూర్తి, నాయకులు రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనగర్లో...
లక్ష్మీనగర్లో మరో అపార్ట్మెంట్ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని అక్రమించి ప్రహారి గోడ నిర్మించాడని, దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు ప్రహారి గోడ ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్కు, షాపింగ్ కాంప్లెక్స్కు దారిని ఎంచుకోవడానికి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గోడ నిర్మించారని మహిళలు ఆరోపించారు.
దీని వల్ల భవిష్యత్లో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ గేటును వెంటనే మూసి వేయాలని మహిళలు డిమాండ్ చేశారు.