Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన ఎస్సీ అభ్యర్థులకందని కార్పొరేషన్ రుణాలు
- ఆన్లైన్ సేవల బంద్తో తిప్పలు
- కార్యాలయం చుట్టూ పేదల ప్రదక్షిణలు
పేదలకిచ్చే సంక్షేమ ఫలాలు అంటేనే పాలకులకు చిన్నచూపు. బడా సంస్థలు, కార్పొరేట్ శక్తులకు రూ.కోట్ల రుణాలు బంగారు పళ్లెంలో పెట్టి మరీ అందజేస్తున్న బ్యాంకులు పేదల పట్ల వివక్ష చూపుతున్నారు. రుణాల కోసం అర్హులైన ఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసినా నేటి వరకూ ఇవ్వని పరిస్థితి. దీంతో వందలాది మంది లబ్దిదారులు కార్పొరేషన్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
నవతెలంగాణ - సిటీబ్యూరో
1186 యూనిట్లు మంజూరు...
హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం కింద రుణాలందించేందుకు గాను ప్రభుత్వం 2017-18 యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రకారం జిల్లాలో 1186 యూనిట్లతో రూ.49.86 కోట్ల రుణాలు అందజేయాలని భావించారు. ఇందులో రూ.29.95 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా అందజేయాల్సి ఉండగా మిగతా రూ.19.90 కోట్లు బ్యాంక్ లింకేజ్ ద్వారా మంజూరు కావాల్సి ఉంది. ఈ రుణాల కు జిల్లా వ్యాప్తంగా సుమారు 3000 దరఖాస్తు లు అందాయి. ఇందులో 1680 మందిని అర్హులుగా గుర్తించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ను కార్పొరేషన్లో అందజేశారు. ఇందులో 1000 మంది బ్యాంకులకు సేవింగ్, లోన్ అకౌంట్లు సమర్పించారు. కానీ నేటి వరకూ ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. బ్యాంకు పొదుపు, లోన్ ఖాతా నెంబర్లను అందజేసిన లబ్దిదారులు లోన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
నిలిచిన ఆన్లైన్ సేవలు...
ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం 1186 యూనిట్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావించింది. అర్హులైన వారందరికీ కార్పొరేషన్ నుంచి రుణం మంజూరు ప్రొసిడింగ్స్ పత్రాలు అందజేశారు. కానీ బ్యాంకు అధికారులు పలు కారణాలను సాకుగా చూపుతూ లబ్దిదారులను అనేక సార్లు తిప్పించుకుంటున్నారు. మరికొందరికి సకాలంలో (ఏప్రిల్ 30 నాటికి) బ్యాంక్ అకౌంట్ వివరాలు అందజేయడంలో జాప్యం జరిగింది. ఆ వెంటనే ఎస్సీ అభివృద్ధి శాఖ బ్యాంకు వివరాలను అప్లోడ్ చేసే ఆన్లైన్ సేవలను నిలిపివేసింది.
యూనిట్ల అంచనాలకు కత్తెర...
ఈ రుణాల్లో సుమారు 40 రకాల యూనిట్లు ఉన్నాయి. వీటిలో ఫొటోగ్రాఫర్, వీడియోగ్రఫీతో పాటు మరికొన్ని యూనిట్లకు రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు యూనిట్ అంచనా వ్యయాన్ని కుదించారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షల వ్యయంతో స్వయం ఉపాధి పొందుదామని అనుకున్న నిరుద్యోగులకు ఒక్కసారిగా ఆ యూనిట్ కాస్ట్ను రూ.3 లక్షలకు తగ్గించేసరికి ఇంత కొంత డబ్బుతో వ్యాపారం ఎలా నిర్వహించాలో అర్ధం కావడం లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన రుణాలకు ప్రభుత్వం వెంటనే సబ్సిడీ విడుదల చేయాలని, ఆన్లైన్ సేవలను పునరుద్ధరించాలని లబ్దిదారులు కోరుతున్నారు.