Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోజగుట్టలో కేటుగాడి మోసం
- రూ. 50 లక్షలు టోకరా
నవతెలంగాణ-మెహిదీపట్నం
బోజగుట్టలోని పేదవారిని లక్ష్యంగా చేసుకుని నాలుగు నెలల కితం ఓ కేటుగాడు వంద రూపాయలకే స్కూల్ విద్యార్థులకు కావాల్సిన రూ. 300ల విలువగల స్టేషనరీని విక్రయించాడు. కొన్ని రోజులనంతరం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 2 వేలు తీసుకుని తిరిగి వారినికో రూ. 1500 రూపాయల విలువగల చీర, రూ. 350 ఇచ్చాడు. ఇలా నాలుగు వారాల పాటు చేశాడు. ప్రజల్లో నమ్మకం చేసిన తర్వాత అసలు మోసానికి పూనుకున్నాడు. వారంలో మీరు కట్టిన డబ్బుకు రెండింతలు ఇస్తానని నమ్మబలికాడు. కొందరు నమ్మి డబ్బులు కట్టగా వారికి చెప్పినట్టుగానే రెండింతలు చెల్లించాడు. దీంతో ఎక్కువ మంది తమ దగ్గరున్న డబ్బులు రెండింతలు చేసుకునే ఆశతో కేటుగాడికి చెల్లించారు. మొత్తాన్ని తీసుకున్న కేటుగాడు కన్పించకపోవడంతో కొంత మంది అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితున్ని బుధవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను అసీఫ్నగర్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గురువారం ఏసీపీ అశోక చక్రవర్తి వివరాలను వెల్లడించారు. నిందితుడు ప్రకాశం జిల్లా తీరాలకు చెందిన కొండ వెంకటమురళీకృష్ణగా గుర్తించినట్టు తెలిపారు. నిందితునిపై ఇదే తరహా రెండు కేసులు ప్రకాశం జిల్లాలో నమోదైయ్యాయని తెలిపారు. నిందితుడు సుమారు రూ. 50 లక్షల వరకూ బోజగుట్ట, పరిసర ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడినట్టు వివరించారు. వీటిల్లో రూ. 12 లక్షలు, పలు రకాల ఆరు బంగారు ఆభరణాలు, రెండు బంగారు బ్రాస్లెట్స్, తొమ్మిది ఉంగరాలు, నొకియా ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మిగితా సొత్తు రికవరీ కోసం నిందితుని స్వగ్రామానికి తీసుకెళ్లి విచారించినట్టు తెలిపారు. ప్రజలు అత్యాశతో మోసపోవద్దని సూచించారు. ఈ సమావేశంలో అసిఫ్నగర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై కుమారస్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నది.