Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులాంతర వివాహ ప్రత్యేక చట్టం ఏర్పాటుచేయాలి
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- నగరంలో పలు చోట్ల నిరసనలు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు
నవతెలంగాణ-ముషీరాబాద్
కులహంకర హత్యలకు కారణం ప్రభుత్వ ఉదాసీనతే అని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. బుధవారం ఎస్ ఆర్ నగర్లో నడిరోడ్డుపై మాధవి, సందీప్లపై మనోహరాచారి చేసిన దాడిని నిరసిస్తూ గురువారం ముషీరాబాద్ చౌరస్తాలో ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కులదురహంకారుల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రణరు హత్యను మరువక ముందే మరో తండ్రి కులాంతర వివాహం చేసుకున్నారని కన్నబిడ్డ, అల్లుడిపై దాడికి పాల్పడటం దారుణమైన చర్య అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోయిందని, ఇటీవల కాలంలో దాడులు పెచ్చుమీరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడుల పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించటం వల్లనే ఈ దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. తక్షణమే కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడికి పాల్పడిన ఘటనలను ప్రత్యేక కేసులుగా పరిగణించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా దోషులకు కఠిన శిక్షలు విధించాలని కోరారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి అరుణజ్యోతి మాట్లాడుతూ కులాంతర వివాహాలు చేసుకున్న యువతీయు వకులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి.సరళ, ఉపాధ్యక్షురాలు ఆశాలత, సహాయ కార్యదర్శి బి.హైమావతి, నాయకులు పద్మ, భవాని, విమల, షబానాబేగం, శారద పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ
కులదురహంకార హత్యలపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నేటికి ఎందుకు మౌనం వహిస్తున్నారని, కులదురహంకార హత్యల నివారణకు ప్రణరు యాక్టు తీసుకురావాలని ఓయూలో ఎస్సీ విద్యార్థి నేతలు ఆర్.లింగస్వామి, ఎం.భాస్కర్, శరత్శూరాలు డిమాండ్ చేశారు. గురువారం ఓయూలో ప్రణరు హత్యను నిరసిస్తూ ఓయూలో ఎస్సీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రణరు సంఘీభావ ర్యాలీ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ గేట్ వద్ద భారీ గ్రేడ్సు త్రోసుకొని వెళ్తున్న విద్యార్థి నేతల్ని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడంతో, పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. దీంతో విద్యార్థులు కేసీఆర్కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రణరు కుటుంబానికి, అమృత వర్షిణికి రక్షణ కల్పించాలని, ఈ మొత్తం ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచేత న్యాయవిచారణ జరిపించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. హత్యతో సంబంధం ఉన్న రాజకీయ నేతలపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ వైఫల్యం అయ్యిందన్నారు. ఇంత దారుణాలు జరుగుతున్న దళిత ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు నోరు విప్పకుండా కేసీఆర్కు బానిసలు కావటం సిగ్గుచేటు అని వారు ఎద్దేవా చేశారు. మారుతీ రావు, మనోహరచారిలను ఉరి తీయాలని, కులదురహంకార హత్యలు ఆగే వరకు ఉద్య మం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఓయూ సంఘాల ప్రతినిధులు సుధాకర్, వెంకట్, శేఖర్, నరేష్, దర్షన్, ప్రదీప్, జి.శ్రీను, ప్రేమ్, వెంకట్, రవి, పుల్లారావ్, తిరుమహేష్, కృష్ణ మాదిగ, శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.
'నిందితుల్ని ఉరి తీయాలి'
మిర్యాలగూడలో ప్రణరును హత్య చేయించిన మారుతీరావు, హైదరాబాద్ నగరంలో సందీప్, మాధవీలపై కులోన్మాద హత్యలు చేసిన కుల ఉన్మాదులను బహిరంగ ఉరి తీసి, వీటి నివారణకు ప్రణరు చట్టం తీసుకురావాలని ఎంఎస్ఎఫ్(టీఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగరి శంకర్, ఓయూ గెస్టులో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. కన్నతల్లిదండ్రులే పరువు కోసం కుల పైశాచికత్వంతో సొంత బిడ్డలనే కడతేర్చే పరిస్థితి దారుణం అన్నారు. మొన్న మంథనిలో-మధుకర్, నిన్న స్వాతి, నరేష్, నేడు ప్రణరు, సందీప్లు వరుసగా దాడులు చేస్తున్న వాటి నివారణలో పోలీసులు, ప్రభుత్వం వైఫల్యం అయ్యిందన్నారు. వీటి నివారణకు కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ ఇవ్వాలని కోరారు. లేకపోతే టీఎస్-ఎంఎస్ఎఫ్ భౌతిక దాడులు చేస్తుందని శంకర్ హెచ్చరించారు. ఎంఎస్ఎఫ్ నేతలు వి.చందు, గోవర్ధన్, తిరుమలేష్, జీవన్, నాగరాజు, ప్రశాంత్; పవన్లు పాల్గొన్నారు.
నారాయణగూడ :
పైశాచిక పరువు హత్యల్ని, కిరాతక కులోన్మాద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పరువు హత్యల కేసుల్లో నిందితులని కఠినంగా శిక్షించాలని ఏఐఎంఎస్ఎస్, ఏఐడిఎస్వో, ఏఐడీవైవో సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్రాం విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ హత్యలకు కారకులైన హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సంగీత, జ్యోతి, తేజ, శైలజ, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఏఎస్రావునగర్
కులదురహంకార హత్యలను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు మేడ్చల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి కృపాసాగర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధాకరంలోకి వచ్చిన తర్వాత పథకం ప్రకారమే దళితులపై, మైనార్టీల మీద అగవ్రర్ణ పెత్తందారులు దాడులు చేస్తూ, హత్యలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు బాలు, ఐద్వా జిల్లా అధ్యక్షకార్యదర్శి సృజన, వినోద, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజశేఖర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి భాస్కర్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు శంకర్, డీవైఎఫ్ఐ , కేవీపీఎస్ జిల్లా నాయకులు నర్సయ్య, సఫియా సుల్తానా పాల్గొన్నారు.
కంటోన్మెంట్
ప్రణరును చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ డీఎస్ఎస్, బహుజన సాహితీ అకాడమీల ఆధ్వర్యంలో గురువారం దళిత సంఘం నాయకులు, కార్యదర్శులు సమావేశమై, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మిర్యాలగూడలో జరిగిన ప్రణరును చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని, పోలీసులు విఫలమయ్యారని విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కులాంతర వివాహాలకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని వారు డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని దళిత సంఘర్షణ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, జై శీలం, వినీత పాల్గొన్నారు.