Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్
- మేడ్చల్ జిల్లాలో ఓటరు జాబితా అంశాలపై కలెక్టర్ ఎంవీ రెడ్డితో చర్చ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
18 ఏండ్లు నిండిన ప్రతి వ్యక్తి తమ పేరును ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ అన్నారు. గురువారం ఆయన మేడ్చల్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి కలెక్టర్ ఎంవీ రెడ్డితో జిల్లాకు సంబంధించిన ఓటరు జాబితా, సవరణలు, ఈవీఎంలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం శామీర్పేట మండల పరిధిలోని సింగాయిపల్లి గ్రామంలోని పోలీంగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఓటరు జాబితా రిజిష్టస్టర్లను పరిశీలించి బూత్లెవెల్ అధికారిని ఓటరు నమోదు కార్యక్రమం, ఓటరు జాబితాలో సవరణలు, పోలీంగ్ కేంద్రంలో మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల ర్యాంప్, మూడు చక్రాల సైకిలు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మరణ ధృవీకరణ రిజిస్టర్ ప్రకారం మరణించిన ఓటర్లను తొలగించాలని, లాజికల్ ఎర్రర్స్, బోగస్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి పౌరుడు తమ పేరును ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన పర్చాలని సూచించారు. అనంతరం నల్సార్ యూనివర్సిటీ సమీపంలో గల వ్యవసాయ గిడ్డంగిలో భద్రపర్చిన ఈవీఎంలను పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, పోలీస్ బందోబస్తు గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు 2630 కంట్రోల్ యూనిట్స్, 3338 బ్యాలెట్ యూనిట్స్, 2850 వీవీ ప్యాట్లు చేరాయని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఈ నెల 19న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ఫస్ట్లెవెల్ పరిశీలన నిర్వహించామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ఈవీఎంల భద్రత కట్టుదిట్టంగా ఉందని, సీసీ కెమెరాల నిఘా, పోలీస్ బందోబస్తు ఇతర ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎన్నికల టీంతో పాటు, బీఈఎల్ నుంచి వచ్చిన టెక్నికల్ టీం చాలా బాగుందని ప్రశంసించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ఫస్ట్లెవెల్ పరిశీలన నిర్వహించమని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కలిగే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా వారి సమక్షంలో త్వరలో మాక్ పోల్ నిర్వహిస్తామని అన్నారు.