Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- తడిచి ముద్దైన ప్రయాణికులు
- కొట్టుకుపోయిన చిరు వ్యాపారుల వస్తువులు
- భారీగా ట్రాఫిక్ జాం
నవతెలంగాణ - యంత్రాంగం
హైదరాబాద్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీక్రిష్ణానగర్ ఎ బ్లాక్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి విగ్రహం కొట్టుకుపోయింది, ఫిల్మ్నగర్, బంజారాహిల్స్ లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దిల్సుఖ్నగర్ ప్రాంతంలో భారీ వర్షం కురిసి రెండు గంటల పాటు ట్రాఫిక్ జాం అయ్యింది. ఇదే ప్రాంతంలో రోడ్డుపై వరద పెద్ద ఎత్తున రావడంతో రోడ్డుపై ఉంచిన చిరువ్యాపారుల వస్తువులన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఎల్బీనగర్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. వనస్థలిపురం, నాగోల్, చంపాపేట, కొత్తపేట, కర్మన్ఘాట్, మన్సూరాబాద్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. గోల్నాక, అంబర్పేట, రామంతాపూర్, బతుకమ్మకుంట, నారాయగూడ, హైదర్గూడ, బాగ్లింగంపల్లి, విద్యానగర్ ప్రాంతాల్లో సాధారణ వర్షం కురిసింది. కూకట్పల్లి, ఉప్పల్, ఏఎస్రావునగర్, పాతబస్తీ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎస్పీరోడ్డు, ప్యారడైస్, ప్యాట్నీ, రెజిమెంటల్ బజార్, మారేడ్పల్లి, తుకారాంగేట్, చిలుకలగూడ, మల్కాజిగిరి సఫిల్గూడ, నేరేడ్మెట్, మౌలాలి, ఆనంద్బాగ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దసరా పండుగ నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు ఎల్బీనగర్ వద్ద వందలాదిగా వచ్చారు. ఈ క్రమంలో వర్షం పడడంతో తడిచి ముద్దయ్యారు. సరైన బస్షెల్టర్లు లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.