Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్రూరల్
కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఎండిపోతున్న పంటలను చూసి రైతులు అల్లాడుతుంటే.... కాసులకు కక్కుర్తి పడి కరెంట్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడంలో నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో కడుపుమండిన రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మంగళవారం వికారాబాద్ సబ్డివిజన్ కార్యాలయం ఎదుట జరిగింది. ధారూర్ మండలం కుక్కింద గ్రామానికి చెందిన 14 మంది రైతులు ట్రాన్స్ఫార్మర్ కోసం రెండు రోజులుగా వికారాబాద్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు పడిగాపులు పడుతున్నారు. వారం రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో సొంత ఖర్చులతో వికారాబాద్ సబ్డివిజన్ కార్యాలయానికి మరమ్మతు కోసం తీసుకొచ్చారు. కాసులకు కక్కుర్తి పడ్డ అధికారులు రైతు లకు సకాలంలో ట్రాన్స్ఫార్మర్ను మర మ్మతు చేసి ఇవ్వలేదు. పంటలు ఎండిపో వడంతో రైతులు ఆందోళన చెంది విద్యుత్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొన్నేండ్ల కింద కుక్కింద గ్రామానికి చెందిన 14 మంది రైతులు కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం ఒక్కోరైతు రూ. 6 వేల చొప్పున డీడీలు కట్టారు. కాని విద్యుత్ అధికారులు మాత్రం ఇంతవరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ను అమర్చలేదు. తూతూ మంత్రంగా 45 హెచ్పీ మూడు మినీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి, రైతులకు కరెంట్ సరఫరా చేశారు. దీనిపై కేవలం 5నుంచి 6 లోపు వ్యవసాయ సర్వీసులు ఇవ్వవల్సి ఉండగా దాదాపు 14 సర్వీసులు ఈ ట్రాన్స్ఫార్మర్పై వేశారు. దీంతో లోవోల్టేజీ సమస్య ఏర్పడి తరచు మినీ ట్రాన్స్ఫార్మర్ బుడ్లు కాలిపోతున్నాయి. తాము కొత్త ట్రాన్స్ఫారం కోసం డీడీలు చెల్లించామని కొత్త ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాని వారి నుంచి విచిత్రమైన జవాబు వచ్చింది. రైతుల చెల్లించిన డీడీలతోనే మినీ ట్రాన్స్ఫారం బుడ్లు ఏర్పాటు చేశామని, కొత్త ట్రాన్స్ఫారం అవసరమైతే ప్రతీ రైతు రూ.6 వేల డీడీ చెల్లించాలని అధికారులు రైతులకు తెలిపారు. దీంతో రైతులు, విధ్యుత్ అధికారుల మధ్య కొద్దిసేపు వాగ్వావాదం జరుగడంతో రైతుల పీడ వదిలించుకోవడానికి విద్యుత్ శాఖ అధికారులు తెలివిగా హడాహుడిగా పాత ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేసి పంపించారు. కాగా రైతులు చెల్లించిన డీడీలపై ఫామ్హౌజ్ యజమానుల నుంచి అధికంగా సొమ్ముతీసుకుని వారికి ట్రాన్స్ఫార్మర్లు బిగించినట్టు రైతులు తెలిపారు. ఈ విషయమై ధారూర్ విద్యుత్ శాఖ ఏఈ జగదీష్ని ప్రశ్నిస్తే గతంలో రైతులు ట్రాన్స్ఫారం కోసం డీడీలు చెల్లించిన మాట వాస్తవమేనని, ఆ డీడీలు ఏమయ్యాయో తనకు తెలియదని దాటవేశారు. రైతులు చెల్లించిన డీడీలపై ట్రాన్స్ఫార్మర్ బిగించినట్టు రికార్డుల్లో ఉందన్నారు. ట్రాన్స్ఫారం కాలిపోతే 24 గంటలు గడిచేలోపు ప్రత్యేమ్నాయంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్ అమర్చవల్సి ఉన్నా, వాహనాల కొరత ఉందని సకాలంలో అధికారులు ట్రాన్స్ఫార్మర్ను అందించలేకపోతున్నారు. అత్యవసరమైతే రైతులే రవాణా చార్జీలు చెల్లించుకుని ట్రాన్స్ఫార్మర్ తీసుకపోవల్సి ఉంటుందని ధారూర్ ఏఈ జగదీష్ తెలిపారు. అంతేకాకుండా వికారాబాద్లో ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుచేసే సిబ్బంది డబ్బులు ఇవ్వనిదే ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసి ఇవ్వడంలేదు.