Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జవహర్నగర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం లక్ష్యం నీరుగారిపోతున్నది. ప్రజలకు ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం దిశ మార్గం తప్పుతున్నది. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటి వరకూ చేపట్టిన పనుల ద్వారా ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రజలను మరింత ఇబ్బంది పెట్టేదిశగా మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్ గ్రామ పంచాయతీ సిబ్బంది భగీరథ నల్లా కనెక్షన్లు కావాలంటే రూ. 2500 చెల్లించాలంటున్నది. ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్ అని కేసీఆర్ ఇచ్చిన హామీకి జవహర్నగర్ గ్రామ పంచాయతీ అధికారులు, పాలకులు తూట్లు పొడుస్తున్నారు. ఈ మేరకు సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ రూ. 2,500 చెల్లిస్తేనే నల్లా కనెక్షన్ ఇస్తామని ఆటోలో ప్రచారం నిర్వహిస్తున్నది. కేసీఆర్ ప్రకటనకు భిన్నంగా ప్రచారం చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా మంగళవారం బస్తీ నాయకులు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పాకాల దానియల్ మాట్లాడుతూ నిర్ణయించినంత చెల్లించి నల్లా కనెక్షన్లు తీసుకోకుంటే ఉన్న నల్లా కనెక్షన్లనూ తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. ఈ విధంగా ప్రజలను మోసం చేయడం ప్రభుత్వానికి సబబు కాదన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ విషయం పట్ల జవహర్నగర్ గ్రామ కార్యదర్శి బాధ్యత వహించి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని బస్తీల ప్రజలను కలుపుకొని ధర్నా చేపడతామని హెచ్చరించారు. జవహర్నగర్లో నివసిస్తున్న పేదలకు ఇండ్లను పంపిణీ చేయడంలో 58.59% వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జవహర్నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ కమిటీ మహిళా నాయకురాలు శారదా, తెలంగాణ నవ సమాజ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ జావిద్, ఇబ్రహీం, రాజయ్య, హాసన్, రాజు మణెమ్మ, లక్ష్మణ్ పాల్గొన్నారు.