Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరవాసుల నుంచి మెట్రో రైల్కు మంచి ఆదరణ లభిస్తోంది. క్రమక్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. చిన్నచిన్న ఫిర్యాదులు మినహా మెట్రో సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు మెట్రో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కారిడార్-1(మియాపూర్-ఎల్ బీనగర్-29 కి.మీ) పూర్తి స్థాయిలో ప్రారంభం కావడంతో అంచనాలకు మించి ప్రయాణిస్తున్నారు. అమీర్పేట నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో ప్రారంభమైన నెలరోజుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య సుమారు 1.50 లక్షల వరకు నమోదువుతుందని మెట్రో అధికారులు చెబుతున్నారు.
ఫేజ్-1 మెట్రో ప్రాజెక్టులో అత్యంత కీలమైన కారిడార్గా గుర్తించిన మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో ముందుగా అంచనా వేసిన విధంగానే ప్రయాణికులు మెట్రోను ఆదరిస్తున్నారు. ఈ మార్గం గుండా మెట్రో స్టేషన్లలో పూర్తి స్థాయిలో పనులు కాలేదు. పార్కింగ్ ఇతర సమస్యలుఉన్నాయి. దీనికితోడు నగరంలో ట్రాఫిక్ దృష్ట్యా మెట్రోవైపు ప్రయాణికులు మొగ్గుచూపుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్-అమీర్పేట మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చి నెలరోజులు(సెప్టెంబరు 24న) పూర్తి కావస్తోంది. మెట్రో నూతన సర్వీసుకు సంబంధించి ప్రయాణికుల రద్దీ, చేపట్టిన అదనపు సౌకర్యాలు తదితర విషయాలపై మంగళవారం బేగంపేటలోని మెట్రో భవన్లో హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్టీ ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
3.15 నిమిషాలకో మెట్రో రైల్..
ఎల్బీనగర్-మియాపూర్ నడుమ అత్యంత రద్దీ సమయంలో 3.15 నిమిషాలకో మెట్రోరైలు నడుపుతున్నామని హెచ్ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ స్టేషన్ నుంచి ప్రతి నిత్యం సగటున 30వేల మంది ప్రయాణిస్తున్నారన్నారు. ఎల్బీనగర్-మియాపూర్ రూట్లో చిన్నచిన్న ఫిర్యాదులు మినహా, ఈ రూట్లో మెట్రో సేవలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న గణాంకాలను ఎన్వీఎస్ రెడ్డి విడుదల చేశారు. మెట్రో కారిడార్-1లోని ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో ప్రతిరోజూ 21 రైళ్లు, మెట్రో కారిడార్-3లోని నాగోలు-అమీర్పేట మధ్య 12 రైళ్లు నడుపుతున్నామన్నారు. మొత్తం 33 రైళ్లు ప్రతి రోజూ రాకపోకలు సాగిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ రెండు మెట్రో మార్గాల్లో అత్యంత రద్దీ సమయంలో 3.15 నిమిషాలకు, సాధారణ రద్దీ సమయంలో 6.15 నిమిషాలకో మెట్రో రైల్ను నడుపుతున్నామన్నారు. ఇతర సాధారణ సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒక మెట్రో రైలు సేవలు అందిస్తున్నాయని తెలిపారు.
కారిడార్-1,3ల్లో ప్రతిరోజూ 550 ట్రిప్పులు
మెట్రో కారిడార్-1 ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో ప్రతి రోజూ 284 ట్రిప్పులు, కారిడార్-3లో 266 ట్రిప్పులతో మొత్తం 550 ట్రిప్పుల ద్వారా ప్రయాణికులను తమతమ గమ్యస్థానాలకు చేరుస్తున్నామని ఎల్అండ్టీ మెట్రోరైల్ మేనేజింగ్ డెరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. మెట్రో కారిడార్-1లో ప్రతిరోజూ సుమారు లక్షా25 వేల మంది, కారిడార్-3లో 50వేల మంది ప్రయాణిస్తున్నారన్నారు. అక్టోబరు 22న మెట్రో కారిడార్-1,3ల్లో మొత్తం లక్షా 90వేల మంది ప్రయాణించారు. పేయిడ్ యూజర్స్ లక్షా 77వేలుగా నమోదైనట్టు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రోరైలు సర్వీసులను ప్రజలు మరింత వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎల్అండ్టీ మెట్రో రైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనిల్ సైనీ, మెట్రోరైల్ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.