Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్పై అన్ని రాజకీయపార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా సిట్టింగ్ స్థానాలు, రెండో స్థానంలో నిలిచిన స్థానాలను తిరిగి దక్కించుకోవాలని చూస్తోంది. మహాకూటమిలో సీట్ల పంచాయితీ తెగకపోవడంతో టీడీపీ డోలాయమానంలో పడింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం గ్రేటర్లోని సిట్టింగ్ స్థానాలతోపాటు ఖైరతాబాద్, ముషీరాబాద్ స్థానాల కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని బాబు సమక్షంలో జరిగిన సమావేశంలో వెల్లడించినట్టు నగర నేతలు చెబుతున్నారు.- నవతెలంగాణ, సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ మహానగరంలో మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. హైదరాబాద్ జిల్లాలోని సనత్నగర్ నుంచి తలసాని శ్రీనివాస్యాదవ్, కంటోన్మెంట్ నుంచి సాయన్న, జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, శివారుప్రాంతాలైన రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ నుంచి ఆర్ కృష్ణయ్య, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి నుంచి అరికెపూడిగాంధీ, రాజేంద్రనగర్ నుంచి ప్రకాష్గౌడ్, కుత్బుల్లాపూర్ నుంచి కేపీ వివేకానంద, మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి గత ఎన్నికల్లో విజయం సాధించారు. వీటితోపాటు ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి ఆశించిన స్థాయిలో ఓట్లు లభించాయి. అయితే ఎన్నికల తర్వాత ఒక్క ఆర్.కృష్ణయ్య తప్ప మిగిలిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక్క కార్పొరేటర్ సీటు రావడంతో కార్యకర్తల్లో మరింత అసహనం పెరిగింది. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలతోపాటు ఓటింగ్ శాతమూ ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్లో మెజార్టీ స్థానాలను దక్కించుకో వడానికి టీడీపీ కసరత్తు చేస్తోంది. వ్యూహాత్మ కంగా కాంగ్రెస్ జతకట్టి కూటమిలో చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చే స్థానాల్లో గ్రేటర్లోని సిట్టింగ్ స్థానాలపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఈ విషయంపై చంద్రబాబు సైతం కాంగ్రెస్ పార్టీతో మాట్లాడనున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఆ రెండు స్థానాలపైనా...
గ్రేటర్లోని సిట్టింగ్ స్థానాలతోపాటు ముషీరాబాద్, ఖైరతాబాద్ స్థానాలపై టీడీపీ భారీగా ఆశలు పెట్టుకుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగానే ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ కేటాయించారు. ఈ రెండు స్థానాల్లో టీడీపీ బలమైన క్యాడర్ ఉందని, టీడీపీ కచ్చితంగా విజయం సాధించే అవకాశముందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కూటమిలో భాగంగా ఖైరతాబాద్ సీటు టీడీపీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముషీరాబాద్ సీటు చర్చనీయాంశంగా మారింది. ఈ సీటు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి తనయుడు వినరుకుమార్, దాసోజు శ్రవణ్ పేర్లు వినిపిస్తున్నాయి. ముషీరాబాద్ స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించి కంటోన్మెంట్ స్థానాన్ని టీడీపీ కేటాయించాలని కూటమి భావించినట్టు సమాచారం. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కంటోన్మెంట్ స్థానం సర్వే సత్యనారాయణకు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
దీంతో ముషీరాబాద్ స్థానం టీడీపీకే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిపై టీడీపీ నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్రావు సైతం పట్టువిడుపుగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాబు సైతం హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సీట్ల కేటాయింపుపై ఐదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని పలువురు నేతలు చెబుతున్నారు.