Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత హక్కుల పోరాట సమితి
నవతెలంగాణ - జవహర్నగర్
గుడికి వెళ్లిన క్రమంలో కులం పేరుతో దళిత మహిళలను దూషించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి రేణుకుంట్ల ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఖండిస్తూ జవహర్నగర్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పలు దళిత సంఘాల రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్నగర్ పీసీ పరిధిలోని లక్ష్మి నరసింహకాలనీలో నివసిస్తున్న సునీత-శ్రీనివాస్ను కులం పేరుతో లక్ష్మణ్, అతని కొడుకు పవన్ దూషించడం సరికాదన్నారు. ఆ ఆలయం తమ సొసైటీకి చెందినదని సునిత దళితురాలు కాబట్టి గుడికి ఎందుకు వచ్చావని అసభ్యకరంగా దూషించారని బాధితురాలు జవహర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి, రాచకొండ కమిషనరేట్లోనూ ఘటన గురించి తెలియజేసిందని తెలిపారు. లక్ష్మణ్ అనేక మోసాలకు పాల్పడి 15 ఏండ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. జవహర్నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 697, 809, 810 లక్మినరసింహస్వామికాలనీలోని 35 ఫ్లాట్లను అమ్ముకున్నాడని తెలిపారు.
అనేక భూ కబ్జాలకు పాల్పడుతూ దళితులను వేధిస్తున్నాడని, ఇతని కొడుకు పవన్, అతని అనుచరులు బస్తీలో వచ్చి పోయే వారినీ బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తం చేశారు. తాజాగా కోటి లింగాల పేరుమీద ఒక్క లింగానికి రూ. 5 వేలు వసూలు చేస్తూ అక్రమంగా కోట్లు సంపాదించాలని కుట్ర పన్నుతున్నట్టు వివరించారు. లక్ష్మణ్పై చర్యలు తీసుకోకపోతే డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, సంఘం ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ భాస్కర్, దళిత సంఘం జాక్ చైర్మన్ సునీల్, ప్రధాన కార్యదర్శి అంజలి ఖాదర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దానియల్, నాయకులు పాల్గొన్నారు.