Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ శైలేంద్రకుమార్
- ఇప్లూలో డైమండ్ జూబ్లీ ఉత్సవాలు
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
ప్రపంచం అంతా కుగ్రామమైన నేపథ్యంలో విదేశీ భాషల అవసరం ఎంతో పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ శైలేంద్రకుమార్జోషి అన్నారు. ఇఫ్లూలో శుక్రవారం రాత్రి ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) డైమండ్ జూబ్లీ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జోషి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీ విద్య, భాషల ప్రాధాన్యతను వివరించారు. ఇఫ్లూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 3 దశల్లో రూపాంతరం చేసి వర్సిటీగా డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవటం హర్షణీయమన్నారు. నేడు వర్సిటీ విదేశీ విద్యార్థుల విడిదిగా మారిందన్నారు. 80 దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు రావటం వర్సిటీ ఖ్యాతి విస్తరిస్తోందని, మరింత క్వాలిటీ పెంపొందించాలని కోరారు. ఇఫ్లూ వీసీ ఆచార్య ఇ.సురేష్కుమార్ మాట్లాడుతూ వర్సిటీలో అందిస్తున్న కోర్సులు, విభాగాలు వివరించి, పరిశోధనలకు, ఉపాధికి మరిన్ని విదేవీ విద్యల్లో బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. నగరంతోపాటుగా షిల్లాంగ్, లక్నో ప్రాంతీయ కేంద్రాల ద్వారా విద్య అందిస్తున్నట్టు కంబోడియా, మయన్మార్, శ్రీలంక, లావోస్, వియాత్నంలో ఆంగ్ల భాషా కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. 'స్వయం మూక్' కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వీసీ సురేష్ తెలిపారు. తను వీసీగా వచ్చాకా చేపట్టిన, చేపట్టబోతున్న సంస్కరణలు ఆయన వివరించారు. అనంతరం ప్రత్యేక 'యాప్'ను ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఆకట్టుకున్న వస్త్రధారణ సాంస్కృతిక కార్యక్రమాలు
వేడుకలకు పలు దేశాల నుంచి విద్యార్థులు, ఆయా, ఆయా దేశాల వస్త్రధారణలతో రావటం, వారి, వారి దేశాల సంస్కృతిక, సంప్రదాయాలు ప్రతిబింభించేలా 15 రకాల సంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్ టి.నాగేశ్వరరావు, కొరియన్ కౌన్సిల్ - సురేష్, ఇరియాన్ కౌన్సిల్ డిప్యూటీ ఆలీ ఆజ్గర్తో పాటు వర్సిటీ అకాడమిక్ డీన్స్, క్యాంపస్ డైరెక్టర్, విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
నామమాత్ర వేడుకే..
ఈ డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాల్సి ఉన్నా కేవలం నామమాత్రంగా ఆరంభ వేడుకలు జరిగి చేతులు దులుపుకున్నారు. రాత్రి పలువురు అతిథిలకు ఇచ్చిన 'డిన్నర్'పై పెట్టిన శ్రద్ధ వేడుకులపై కేంద్రీకరించనట్టు తెలిసింది. ఇక్కడ రాజకీయ భావ ప్రకటన స్వేచ్ఛ లేదని, ప్రశ్నిస్తే రెస్టిగేషన్ చేస్తుండటంతో విద్యార్థులు 20శాతం వరకు వేడుకలకు హాజరు కాలేదు. విదేవీ విద్యార్థులకు ఇచ్చిన ప్రాధాన్యత స్థానిక విద్యార్థులకు ఇవ్వనట్లు వారు ఆరోపించారు. కనీసం అందరినీ భాగస్వామ్యం చేయలేదని కొందరు విద్యార్థులు తెలిపారు. ఈ స్థాయి వేడుకలకు చివరి రెండు రోజుల వరకు అతిథి ఖరారు కాకపోవటం, వీసీ అన్నీ తానై వ్యవహరిస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కేంద్ర స్థాయి వర్సిటీకి యూజీసీ లేక, కేంద్రం నుంచి అతిథులని, నిధుల్ని తీసుకురావటం వీసీ వైఫల్యం చెందారని విద్యార్థులు ఆరోపించారు. ఉత్సవాల ప్రారంభం జరగాల్సిన స్థాయిలో జరగలేదని, కనీసం పూర్వ విద్యార్థులకు , ఆచార్యులకు సమాచారం అందలేదని, వారిని ఆలుమీనీని ఇన్వాల్వ్ చేయటంలో అధికారులు వైఫల్యం చెందినట్టు ఇఫ్లూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.