Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంత కష్టపడ్డా దక్కని గిట్టుబాటు
- సంపాదించిన దాంట్లో సగం షాపు యజమానులు, ట్రాఫిక్ పోలీసులకే!
నవతెలంగాణ - చంపాపేట
పండుగలు, శుభకార్యాలయాలు వస్తే చాలు మహిళలు పూలపై ఆశపడతారు. తలలో పూలు లేకపోతే అందానికి ఎదో లోటుగా భావిస్తారు. అందం, అలంకరం కోసం పూలు కొనుగోలు చేస్తారు. కానీ అవి అమ్మె వారి బతుకులు మాత్రం వాడిపోతున్నాయి. వారు వేలకు వేలు పెట్టిబడి పెట్టి పూలు కొనుగోలు చేసి అల్లి అడ్డాల వద్ద విక్రయిస్తారు. కానీ వారి కష్టానికి తగిన ఫలితం రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని పూలు విక్రయించే మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని చంపాపేట, ఐఎస్ సదన్ డివిజన్ల్లోని పలు కాలనీలు, బస్తీల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటల వరకు పూలు విక్రయించే మహిళలు కనిపిస్తుంటారు. మధ్యాహ్నం తర్వాత ఐఎస్ సదన్ డివిజన్ చౌరస్తా, కల్వకుర్తి బస్టాప్ లాంటి ప్రాంతాల్లోని చెట్ల కింద కూర్చుని పువ్వులు చుడుతూ సాయంత్రం వరకు అటుగా వచ్చి వెళ్ళే వారికి విక్రయిస్తూ ఉంటారు. సాయంత్రం కాగానే తిరిగి తమ స్వంత ప్రాంతానికి వెళ్తుంటారు. పండుగలు, శుభకార్యాల సమయంలో మాత్రం మంచి గిరాకీ ఉంటుందని, మిగతా రోజుల్లో మాత్రం రోజుకు రూ.100-రూ.250 మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆ పూలు వాడిపోకుండా చూసుకోవాడానికి చాలా కష్టపడుతుంటారు. కొనుగోలు చేసిన పూలు అమ్ముడుపోక వాడిపోతే పెట్టిన పెట్టుబడి నేలపాలవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క విక్రయించడానికి స్థలం లేక రోడ్లపై, షాపుల ఎదుట, ఫూత్ పాత్ల వద్ద, ఖాళీ స్థలలాలే దిక్కు. షాపుల ఎదుట కూర్చుంటే యాజమానికి అడిగినంత ఇవ్వాల్సిందేనని కొందరు వాపోతున్నారు. రోడ్డుపై ఉంటే ట్రాఫిక్ పోలీసులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే పూలు పడేస్తారు. ఇన్ని కష్టాలు ఎదర్కొన్నా తనకు ఈ వ్యాపారం తప్ప మరొకటి రాదని మహిళలు వాపోతున్నారు. ఇంత కష్టపడ్డా ఫలితం దక్కక పెట్టిన పెట్టుబడి రాక కుటుంబపోషణ భారంగా మారుతోందని పూలు విక్రయించే మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలాంటి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని వాపోయారు.
భార్యాభర్తలిద్దరం కష్టపడితేనే కుటుంబం గడుస్తది
మాది రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామం. భార్యాభర్తలిద్దరాం రెక్కల కష్టంతోనే కుబుంబాన్ని నెట్టుకొస్తున్నాం. మాకు ముగ్గురు పిల్లలు. వారిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నార. నా భర్త కూలీ పని చేస్తాడు. అయన సంపాదన పిల్లల చదువులకు కావాల్సిన చిన్నపాటి అవసరాలు సైతం తీర్చేందుకు సరిపోవడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆయనకు తోడుగా నేను 20 ఏండ్లుగా పూలు విక్రయించి కుటుంబ పోషణలో భాగాస్వామిని అయ్యాను. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. మాలాంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం గుర్తించి సహకారం అందించాలని కోరుతున్నాను.
-యాదమ్మ, కందుకూరు గ్రామం