Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఇండ్లలో పని చేసే మహిళా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్ అన్నారు. రహమత్నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్లోని పోచమ్మ టెంపుల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.వెంకటేశ్ మాట్లాడారు. నగరంలో లక్షలాది మంది మహిళలు ఇండ్లలో పని చేస్తూ జీవిస్తున్నారని, వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపూ లేదని అన్నారు. వారు నాలుగైదు ఇండ్లలో పని చేస్తే రూ.5వేలు కూడా రావని, బతుకులు దుర్భరంగా ఉన్నాయని అన్నారు. వారిని ప్రభుత్వం గుర్తించి గుర్తుంపు కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కార్యదర్శి ఆర్.వాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో హామీలిచ్చి మాట తప్పారన్నారు. సీఐటీయూ కార్యదర్శి స్వామి మాట్లాడుతూ ఇండ్ల పని వారికి తమ సంఘం అండగా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇంటి పనివారి సంఘం నూతన కమిటీ అధ్యక్షురాలుగా పార్వతమ్మ, ప్రధాన కార్యదర్సిగా ఆదిలక్ష్మి, 9 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఏఆర్ నర్సింహా, టి.భాగ్యరాజు, ఎం.రాజు, బి.లక్ష్మణ్ పాల్గొన్నారు సమావేశం అనంతరం బీఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దల అంజిబాబుకు పూర్తి మద్దతు తెలిపారు. రైతు నాగలి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.