Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రజలందరూ ఐక్యమై నిరసనల ద్వారా ప్రజా ఉద్యమ గొంతుకలను కాపాడుకోవాలని పీఓడబ్య్లూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం గాంధీనగర్లోని వరవర రావు ను అరెస్ట్ చేస్తున్నారు అనే వార్త దావానంలా వ్యాపించటంతో ఆయన ఇంటి వద్ద ప్రజా సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ విరసం నేత వరవరరావును అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. గృహ నిర్బంధంలో ఉన్న పీడిత ప్రజల గొంతుక వరవరరావు వృద్ధాప్యంలో ఉన్నారని, ఈ వయస్సులో ఆయనను అరెస్ట్ చేయటం అన్యాయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు మానుకుని వరవరరావుపై పెట్టిన కేసును ఎత్తివేసి ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కవులను, మేధావులను ఈ విధంగా హింసించటం అమానుషమన్నారు. వేదిక మరో కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయని ఆరోపించారు. అక్రమ కుట్ర కేసులు పెట్టి దేశవ్యాప్తంగా పీడిత ప్రజల పక్షాన ఉన్న వారని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. కన్వీనర్ నారాయణరావు మాట్లాడుతూ రాజకీయ ఖైదీలందరినీ భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమ కారులను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్ట్ సజయ, ప్రజాకళా మండలి అధ్యక్షులు కోటి, పీడీఎం రాజు, విరసం నేత అరవింద్, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షులు దేవేంద్ర, ఐఎఫ్టియూ నాయకురాలు అనురాధ, న్యాయవాది రఘునాధ్, ప్రొఫెసర్ కాశీం తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయం వరవరరావును అరెస్ట్ చేసేందుకు పూణే నుండి పోలీసులు బయలుదేరినట్టు సమాచారం.