Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రజ్ఞన్న'కు మంత్రి పదవి ఇవ్వాలంటున్న లష్కర్ ప్రజలు
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
నిన్నా మొన్నటి వరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారన్న తరుణంలో తీగుళ్ళ పద్మారావు 3వ సారి 45 వేల భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. పద్మారావు గెలిచిన నాటి నుంచి ఆయన 2వ సారి మంత్రివర్గంలో బెర్తు ఖాయమని ఇటు స్థానికంగానే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆయన గెలిచిన వెంటనే అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు 'ప్రజ్ఞన్న' హోంమంత్రి ఖాయమంటూ నినాదాలు చేశారు. మరి హోంశాఖ కాస్తా కేసీఆర్ మహమూద్ ఆలీకి ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో పద్మారావుకు మళ్లీ కేసీఆర్ ఏ శాఖ కేటాయిస్తారన్న చర్చ స్థానికంగా, నియోజకవర్గ వ్యాప్తంగా, ట్విన్ సిటీస్లలో జోరుగా సాగుతోంది. పలు సామాజిక సమీకరణలు, జిల్లాల వారిగా, మంత్రి మండలికూర్పులో ఆది నుంచి టీఆర్ఎస్లోనే ఉండి రాష్ట్రం కోసం ఉద్యమించిన ఈ 'ఉద్యమనేత', ప్రజాదరణ నేతకు నాడు పీజేఆర్ తర్వాత అదే స్థాయిలో 'మాస్ ఫాలోయింగ్' ఉన్నా, నిత్యం ప్రజల్లో ఒక సాధారణ వ్యక్తిమల్లే ఉండే 'తీగుళ్ళ'కు ఆయన శ్రమకు తగ్గ, మరింత సేవ చేయాలంటే ఆదరణ గల 'మంత్రిత్వ శాఖ'ను ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కూటమి, బీజేపీ అభ్యర్థులకు హేమాహేమీలు ప్రచారం నిర్వహించిన, పద్మారావు మాత్రం ఒకే ఒక్కడుగా తన ఇంటింటి ప్రచారాన్ని బస్తీల నుంచి మాస్ ప్రజల వద్దకు, క్లాస్ ప్రజల, అపార్ట్మెంట్ వాసుల, ఉద్యోగుల వరకు సింగిల్గా ప్రచారం చేసి, అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందటం విశేషం. ఇంతగా తనను ఆశీర్వదించిన ప్రజలకు మరింత చేరువ కావాలని, వారి ఆకాంక్షలు నెరవేర్చాలన్నా, గతంలో అభివృద్ధిని కొనసాగిస్తు ప్రజలకు, నియోజకవర్గానికి దీర్ఘకాలికంగా వారి అవసరాలను తీర్చే పనులు చేసి వారి రుణం తీర్చుకోవాలని పద్మారావు తన అనుచరుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన ఆ దిశగా కార్యచరణను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు మంత్రివర్గంలో స్థానం లభించగానే స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు, నిపుణులు, పార్టీ కార్యకర్తలతో చర్చించి నియోజకవర్గ రూపురేఖలు మార్చాలని, ఇక్కడ అధికంగా ఉన్న స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ 'నగర మాస్' నేతకు త్వరలో ఖరారు కానున్న మంత్రివర్గంలో ఎలాంటి మంత్రిత్వశాఖను 'ప్రజ్ఞన్న'కు కేటాయిస్తారో వేచి చూడాల్సిందే.
3వ సారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మారావు సేవలు కేసీఆర్ ఎలా వినియోగించుకుంటారో తెలుసుకోవాలంటే మరో 5 రోజులు ఓపిక పట్టాల్సిందే.