Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ - అంబర్పేట
కేసీఆర్ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలే తనను గెలిపించాయని అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. తన గెలుపుకు కృషి చేసిన నియోజకవర్గం కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి సారిగా శుక్రవారం బాగ్అంబర్పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రమంతటా టీఆర్ఎస్ సునామీ వచ్చిందని, భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏరాటైందని అన్నారు. అదే ఊపులో అంబర్పేట ప్రజలకూ సీఎం కేసీఆర్ను ఆశీర్వదించి తాను చేస్తున్న అభివృద్ధికి మద్దతు పలికారని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్నో శుష్క వాగ్ధానాలు చేసిన ప్రజలు నమ్మకుండా కేసీఆర్ సమర్ధ నాయకుడని పట్టం కట్టారని తెలిపారు. అంబర్పేటలో మూడు పర్యాయాలుగా బీజేపీ నుంచి కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని, 15 ఏండ్లలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కేసీఆర్ రెండోసారి సీఎం అవుతారని ప్రజలు నమ్మి, అంబర్పేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని, ఎన్నో అభివృద్ధి పనుల జరుగుతాయని భావించి మార్పుకోసం తనను గెలిపించారని వెల్లడించారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించారని, ఈ గెలుపుతో తనపై భాద్యత పెరిగిందన్నారు. అంబర్పేటలో కిషన్రెడ్డిని ఓడించటం అంత ఆషామాషీ కాదని, కాలేరు వెంకటేష్ అయితే గెలుస్తాడని తనకు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చి రంగంలోకి దింపాడని తెలిపారు. ఐదుగురు కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకుల సమిష్టి కృషితోనే తన గెలుపు సాధ్యమైందని తెలిపారు. అన్ని డివిజన్ల కార్యకర్తలను ఉత్సాహపరిచి మున్ముందు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తానని, వేరే పార్టీలకు స్థానం లేకుండా చేసే దిశలో అందరిని సంఘటితం చేసి పనిచేస్తానని చెప్పారు. ఎన్నికలు అంటే చిన్న, చిన్న తప్పులు జరుగుతాయని, టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక్కటే, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలంతా సీఎం కేసీఆర్, కేటీఆర్ దిశానిర్దేశంలో పని చేసుకుంటూ వెళ్తామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎన్ని కోట్ల బడ్జెట్ అయినా సరే ఇస్తానని, అంబర్పేటను అభివృద్ధి చేయాలని సీఎం సార్ చెప్పారని పేర్కొన్నారు. ప్రజా తీర్పు ప్రకారం ఇంకా ఎక్కువగా పనిచేసి వారి మన్ననలు పొందాలని సార్ సూచించారని తెలిపారు. అదే దిశలో పనిచేసి మోడల్ అంబర్పేటగా తీర్చిదిద్దుతానని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు పాట్కూరి శ్రీనివాస్, తొలుపునూరి కృష్ణాగౌడ్, బి.నగేష్గౌడ్, అరుణ్కుమార్రెడ్డి, గూళ్ల యాదగిరి, సరిత, శివలీల, టి.రమేష్, చందర్చారి, గాజుల గోపాల్, చేగూరి శ్రీకాంత్, కిరణ్గౌడ్, బొట్టు శ్రీను, తేజగౌడ్ పాల్గొన్నారు.