Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బాలానగర్
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తుఫాను ప్రభావం వల్ల రాత్రి అంతా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం శుక్రవారం ఉదయం వరకు కురిసింది. దీంతో బాలానగర్, ఫతేనగర్, ఫిరోజ్గూడ, ఐడీపీఎల్, చెరబండరాజునగర్, కళ్యాణినగర్, గణేష్నగర్ తదితర ప్రాంతాలు రోడ్లపై వరదనీరు ప్రవహించింది. పారిశ్రామిక బస్తీలు కావడం వల్ల దూరప్రాంతాల నుంచి విధులు ముగించుకుని వచ్చే ఉద్యోగులు, మహిళలు, కార్మికులు ఇబ్బందులకు గురయ్యారు.
ముఖ్యంగా నాలాలు పొంగి పొర్లడం వల్ల పరివాహక ప్రాంతాలైన నవజీవన్నగర్, నాగార్జునకాలనీ, ఫతేనగర్, జింకలవాడ, దదీనదయాల్నగర్ తదితర ప్రాంతాల్లోని నివాసితులు ఇండ్లలోకి నీళ్లు చేరాయి. రాత్రివేళ కావడంతో వాహనదారులు పలు అవస్థలు పడవలసి వచ్చింది. చిన్నపాటి వర్షం పడితేనే చిత్తడిగా మారే రోడ్లు ఏకదాటిగా రాత్రంతా వర్షం కురవడంతో కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లో నీళ్లు ప్రవహించాయి. బాలానగర్ ప్రధాన రహదారికి ఇరువైపులా వరదనీటి కాల్వల నిర్మాణం చేపట్టినా ప్రయోజనం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ సర్కిల్ సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకుని రోడ్లపై వరదనీరు నిల్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నాలాల్లో పేరుకున్న చెత్త, వ్యర్థాలను ఎప్పటికప్పుడూ తొలగించి వరదనీటి ప్రవాహాం సాఫీగా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.