Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైబరాబాద్ సీపీ వీసీ.సజ్జనార్
నవతెలంగాణ - గచ్చిబౌలి
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ.సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పోలీసులు నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఉద్యోగం, అవలీలగా డబ్బులు సంపాదన తదితర పద్ధతుల్లో ఆర్థిక నేరాలు జరుగుతున్నాయన్నారు. వీటికి సంబంధించి మోసాలు జరుగుతున్నాయని, వాటిని గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాల్పోస్టర్లు, ప్లేబోర్డులు, కళారూపాలు, షార్ట్ ఫిల్మ్స్ తదితర పద్ధతుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందుకుగానూ క్రైమ్ డీసీపీ జానకి షర్మిలా ఆధ్వర్యంలో ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తమ ఓటీపీలను ఎవ్వరికీ చెప్పవద్దని సూచించారు. ఏదైనా మేయిల్ వస్తే అందుకు సంబంధించిన మేయిల్ వాస్తవికతను చెక్ చేయాలని, నిజమైన వెబ్సైట్ భద్రత కోడ్ తనిఖీ చేయాలని సూచించారు. నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు డబ్బులు అడగవని చెప్పారు. ఆన్లైన్లో కంపెనీల రివ్యూలు చూడాలన్నారు. మోసగాళ్లు మాత్రమే ఉద్యోగం చ్చేందుకు డబ్బులు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగం కోసం కంపెనీని సందర్శించి వివరాలను సేకరించాలన్నారు. సోషల్ మీడియాలో కూడా మోసానికి పాల్పడుతున్నారని, అపరిచితులతో వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫ్రెండ్ రెక్వెస్ట్లను అంగీకరించవద్దని, డబ్బు సహాయం చేయాలనే ఫేస్బుక్ స్నేహితులకు దూరంగా ఉండాలని తెలిపారు. వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మార్ఫింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇలాంటి జాగ్రత్తలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము ప్రత్యేక కార్యాచరణ ద్వారా ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.