Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో నూతన భవనాలు, ఆస్తిపన్ను చెల్లించని నివాసాలన్నింటికి వెంటనే ఆస్తిపన్ను నిర్థారణ (అసెస్మెంట్) చేసి ఆస్తిపన్ను పరిధిలో తీసుకురావాలని జోనల్, డిప్యూటి కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, ఆస్తిపన్ను సేకరణ తదితర అంశాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో శుక్రవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. అడిషనల్ కమిషనర్లు అద్వైత్కుమార్ సింగ్, జోనల్ కమిషనర్లు హరిచందన, ముషారఫ్ అలీ, శ్రీనివాస్రెడ్డి, రఘుప్రసాద్, శంకరయ్య, డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ జనవరి మాసం నుండి తిరిగి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో నిమగం అయ్యే అవకాశం ఉన్నందున ఈ నెలాఖరులోగా ఆస్తిపన్ను చెల్లించని నివాసాలన్నింటికి యుద్ద ప్రాతిపదికపై ఆస్తిపన్ను మదింపు చేయాలని సూచించారు. గత మూడు నెలలుగా ఎన్నికల ప్రక్రియలో ఉన్నందున ఆస్తిపన్ను సేకరణ మందకోడిగా సాగిందని, ఈ నెలాఖరులోగా కనీసం రూ.100కోట్ల ఆస్తప న్ను రూపేణా సేకరించాలని ఆదేశిం చారు. ముఖ్యంగా నివాసేతర భవనాల (కమర్షియల్)కు సంబం ధించి ఆస్తిపన్నును వందశాతం సేకరించాలని అన్నారు. పన్ను సేకరణపై ప్రతిరోజు తాను సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పన్ను చెల్లించని ఇళ్లకు డిమాండ్ నోటీసులు జారీచేయాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1500 కోట్లు ఆస్తిపన్ను లక్ష్యం కాగా వీటిలో రూ.755 కోట్లు సేకరించాల్సి ఉందని తెలియజేశారు.
స్వచ్ఛ కార్యక్రమాల పర్యవేక్షణకు వార్డు అధికారులు
స్వచ్ఛ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా ప్రతి వార్డుకు ప్రత్యేకంగా పర్యవేక్షక అధికారులను నియమించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ఆయా వార్డులలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, రహదారులపై నిర్మాణ వ్యర్థాల తొలగింపు తదితర స్వచ్ఛ కార్యక్రమాలను ఈ వార్డు అధికారులు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ప్రతి సర్కిల్లో నిర్మాణ వ్యర్థాలు, రాళ్లను తొలగింపుకు ప్రత్యేక వాహనాలను కేటాయించామని, రోడ్లపై ఏవిధమైన వ్యర్థాలు ఉండవద్దని స్పష్టం చేశారు.