Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 32వ హైదరాబాద్ బుక్ ఫెయిర్కు అన్నీ రెడీ
- 300కు పైగా స్టాళ్ల ఏర్పాటు.. 25వరకు కొనసాగింపు
- నేటి సాయంత్రం 5.30 గంటలకు
- ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం
నవతెలంగాణ - ముషీరాబాద్
హైదరాబాద్ బుక్ఫెయిర్.. పేరు వినగానే పుస్తక ప్రపంచం గుర్తుకొస్తుంది కదా! నేటి నుంచి 32వ హైదరాబాద్ బుక్ఫెయిర్ మళ్లీ ప్రారంభం కానుంది. పుస్తక ప్రియులను ఆకర్షించే ఈ పుస్తకాల పండుగను తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో నేడు సాయంత్రం 5:30 గంటలకు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.
మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్ప టికీ, మనుషులు ఎన్ని నూతన పద్ధతులకు అల వాటు పడుతున్నప్పటికీ ఇంకా పుస్తకాల ప్రాధా న్యత పెరుగుతోంది. బుక్ఫెయిర్లకు ఆదరణ తగ్గకపోవడమే అందుకు కారణంగా చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పుస్తక ప్రదర్శ నకు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశ, విదేశాల నుండీ పుస్తక ప్రియులు కొనుగోలు కోసం వస్తుంటారు. నిత్యం వేలాది మంది సందర్శకులతో కళకళలాడే పుస్తక ప్రదర్శనతో నగరంలోని సినిమా థియేటర్లు సైతం వెలవెలపోతాయనడంలో అతిశయోక్తి లేదు.
ఈనెల 25 వరకు కొనసాగే ఈ పుస్తక ప్రదర్శనలో బాలల నుండి వృద్ధుల వరకు అంటే పెద్ద బాలశిక్ష నుండి పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల కోసం ప్రత్యేక పుస్తకాలు, వివిధ సబ్జెక్టులకు సంబంధించి రిఫరెన్స్ పుస్తకాలు, కవులకోసం, కళాకారుల కోసం, సాహితీ ప్రియుల కోసం వివిధ రకాల రచనలు, భారత రామాయణంవంటి అనేక గ్రంథాలతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, తమిళం వంటి అనేక భాషలకు సంబంధించిన పుస్తకాలు, నవలలూ ఇక్కడ లభ్యమవుతాయి. దీంతో అన్ని వయసుల వారు దీన్ని సందర్శించేందుకు ఆరాటపడుతూ ఉంటారు.
కేవలం పుస్తక స్టాల్స్ మాత్రమే కాకుండా ఈ బుక్ ఫెయిర్ లో ప్రతి నిత్యం వివిధ రచయితల పుస్తకాల ఆవిష్కరణలు, సాహితీ సమాలోచనలు, సాహిత్య చర్చలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు బాలల కోసం బాల వికాస్ కార్యక్రమమూ నిర్వహిస్తుం టారు. బాలవికాస్ పేరుతో ప్రతి రోజు కథలు, వ్యాసరచన పోటీలు, వకృత్వ పోటీలు, క్విజ్లు, డ్రాయింగ్, పెయింటింగ్వంటి అనేక అంశాల లో బాలలకు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లూ అందచేస్తూ ఉంటారు. ప్రతి రోజూ నగరంలో ఉన్న పాఠశాలల యాజమాన్యాలు వారి విద్యా ర్థులను ఈ ప్రదర్శనకు తీసుకువస్తూ ఉండట మే కాకుండా గురుకుల విద్యార్థులు బుక్ ఫెయర్ను ప్రత్యేకంగా సందర్శిస్తుంటారు.
కవులను, రచయితలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కృషి : చంద్ర మోహన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి
కవులను రచయితలను ప్రోత్సహించేందు కు బుక్ ఫెయిర్ మంచి వేదిక కానుంది. వారు రచించిన పుస్తకాలను, గ్రంథాలను పెద్ద ఎత్తున మేమే విక్రయించేందుకు ఏర్పాటు చేశాం. తెలంగాణ సాహిత్యాన్ని మరింత అభివృద్ధి చేసి కనుమరుగవుతున్న కవుల రచనలకు జీవం పోయాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రదర్శనతో పుస్తకాలకున్న విలువ మరింత పెరుగుతుంది. దాదాపు 10లక్షలకు పైగా ఈ ప్రదర్శనను సందర్శిస్తారని ఆశిస్తున్నాం.
జాతీయ స్థాయిలో గుర్తింపు : గౌరీ శంకర్, బుక్ ఫెయిర్ అధ్యక్షులు
ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయబడుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. మన దేశంలో ఏర్పాటయ్యే మూడు బుక్ ఫెయిర్స్లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రథమ స్థానం సంపాదించుకోవటం మనకు గర్వకారణం. ఇప్పుడు నిర్వహించే 32 వ బుక్ ఫెయిర్లో 331 స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమూ బుక్ ఫెయిర్కు ఎంతో సహకరించటం వల్లే ఇంత విజయవంతంగా దీన్ని నిర్వహించగలుగు తున్నాం. భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదగా ప్రారంభం అయ్యే ఈ బుక్ ఫెయర్ ముగింపు సమావేశానికి ముఖ్యమంత్రి సైతం హాజరయ్యే అవకాశముంది.
పుస్తక పఠనంలో భారత దేశం మొదటి స్థానం : బుర్రా వెంకటేశం, ముఖ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ
ప్రపంచ వ్యాప్తంగా పుస్తక పఠనంలో మన దేశం ప్రథమ స్థానంలో ఉందంటే పుస్తకానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో తెలుస్తోంది. పుస్తకాలను కొనేస్థాయి మన దేశంలో అందరికీ లేకపోయినప్పటికీ చదివే ఆసక్తి మాత్రం చాలా మందికి ఉంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్కు ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. పుస్తకాల పట్ల ఆసక్తి ఉన్న ముఖ్యమంత్రి మనకు రావటం అదృష్టం. తెలంగాణ సమాజం తన ఉనికిని, చరిత్రను వెనక్కు తిరిగి చూసుకునే క్రమంలో ఈ బుక్ ఫెయిర్కు ప్రాధాన్యత పెరుగుతుంది. జాతీయ స్థాయిలో పుస్తక ఆవిష్కరణలు ఇక్కడ జరిగే స్థాయికి ఈ బుక్ ఫెయిర్ ఎదగాలి.
పుస్తకాల్లోనే ప్రపంచం ఇమిడి ఉంటుంది : బీఎస్ రాములు, బీసీ కమిషన్ చైర్మన్
మనకు అందుబాటులో ఉండే పుస్తకాల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. పుస్తకాల్లో యావత్ ప్రపంచం ఇమిడి ఉందనటంలో ఎటువంటి సందేహమూ లేదు. జీవితంలో జరిగే అనేక అంశాలు పుస్తకాల్లోనే పొందుపరచబడి ఉంటాయి. మీడియా ఎంత అభివృద్ధి చెందినా పుస్తక విలువ ఏమాత్రం తగ్గలేదు. అన్ని సబ్జెక్టులు, అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండే ఇటువంటి ప్రదర్శన సంవత్సరానికి రెండు సార్లు ఏర్పాటుచేయాలి.
పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలి : వకుళాభరణం కృష్ణమోహన్, సామాజికవేత్త
మనం ఇతరులకు ఏదైనా బహుమతి ఇవ్వాలంటే పుస్తకాన్ని ఇవ్వటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని జ్ఞాన తెలంగాణాగా మార్చేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు, కవులు, కళాకారులు వంటి అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ ప్రదర్శన ఉపయోగ పడుతుంది.