Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
నవతెలంగాణ-వనస్థలిపురం
ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన తెలంగాణ ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగాయని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టీస్ చంద్రకుమార్ అన్నారు. సాగర్రోడ్డులోని హస్తినాపురంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పార్టీ తరుపున ఎల్బీనగర్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనకే తన ఓటు పడలేదన్నారు. ఇంతటి దుర్మార్గమైన వ్యవస్థలో ఎన్నికల నిర్వాహణ జరిగిందంటే ఏవిధంగా ఈ ఎన్నికలను ప్రజలు, మేధావులు, యువతరం స్వాగతీస్తారన్నారు. బూత్ నెంబర్ 388లో ఉన్న తన ఓటు హక్కును తన పార్టీ గుర్తుపై వేసినప్పటికీ కన్ఫర్మేషన్ ప్రొఫార్మ సైతం వచ్చిందన్నారు. తీరా ఎన్నికల అనంతరం అధికారులు ఇచ్చినటువంటి అధికారిక సమాచారంలో 388వ బూత్లో తమ పార్టీకి సున్నా చూపిస్తుండటం ఎన్నికల అవకతవకలకు నిదర్శనమన్నారు. మా కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం ఓట్ల సంఖ్య 5 అయినప్పటికీ 389వ బూత్లో కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చిందన్నారు. ఈ విధమైన ఎన్నికలు ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ కుమ్మక్కుతోనే జరిగిందని ఆరోపించారు. ఒక్కొక్క అభ్యర్థికి అక్కడి పరిస్థితులను బట్టి 20వేల నుంచి 50వేల ఓట్ల వరకు ఓటింగ్ ట్యాంపరింగ్కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. భౌగోళికంగా ఎన్నికల అధికారులు సక్రమంగానే ఎన్నికలు నిర్వహించామని చెబుతున్నప్పటికీ పోలైన ఓట్ల సంఖ్య చెప్పడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 24 గంటలు పైబడి సమయం ఎలా పడుతుందని చంద్రకుమార్ ప్రశ్నించారు. ఫారం నెంబర్ 17(సీ), ఫార్ట్ 1, 2 ప్రకారం ఈ విధానంలో రెండు రకాలుగా వినియోగించుకోవచ్చని తెలిపారు. మొదటగా ఓటింగ్శాతం నమోదు ప్రక్రియ ఒకటైతే, రెండో విభాగంలో ఈవీఎంలు సైతం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందన్నారు. ఈవీఎంలపై ప్రజల్లో అనేక సందేహాలున్నప్పటికీ వాటన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సిన కమిషన్ మాత్రం నిద్రావస్థలో ఉండటం ప్రజాస్వామ్యానికి విఘాతమన్నారు. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తే తప్ప నిశ్వార్థంగా వ్యవహరించే, సేవ చేసే నాయకులను ప్రజలు ఎన్నుకుంటారన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల నిర్వాహణ తీరుపై న్యాయస్థానాలు ఆశ్రయించడంతో పాటు నిరహారదీక్షకు దిగుతానని చంద్రకుమార్ అన్నారు. ఎన్నికల నిర్వాహణపై వివిధ పార్టీల నాయకులు తమతో కలిసి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో తెలంగాణ ప్రజల పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గం అభ్యర్థి మురళీధర్గుప్త, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్నాయుడు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అభ్యర్థి కోట్ల వాసు తదితరులున్నారు.