Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ కార్యక్రమాలపై ర్యాంకింగ్ జనవరి 4 నుంచి 31వ తేదీలోపు నిర్ధారణ
- జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలోని 5వేల నగరాల్లో చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాలపై ర్యాంకింగ్ నిర్థారణకు జనవరి 4వ తేదీ నుండి 31వ తేదీలోపల స్వచ్ఛ సర్వేక్షణ్-2019 ప్రత్యేక బందాలు హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నందున స్వచ్ఛ సర్వేక్షణ్ అంశాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ క్షేత్ర అధికారులకు కమిషనర్ దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. స్వచ్ఛ భారత్ మిషన్-2019 స్వచ్ఛ సర్వేక్షణ్ను దేశంలోని 5వేల నగరాల్లో ప్రారంభించి మొత్తం నాలుగు విభాగాల్లో 5వేల మార్కుల ప్రాతిపదికపై నగరాలకు స్వచ్ఛ ర్యాంకింగ్లను ప్రకటించనుంది. నాలుగు విభాగాలైన స్వచ్ఛ సేవల ప్రాతిపదిక, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రత్యక్ష పరిశీలన అంశాలు, సర్టిఫికేషన్లకు ఒక్కో అంశానికి 1,250 మార్కులు స్వచ్ఛ సర్వేక్షణ్లో వేయనున్నారు. 2018 స్వచ్ఛ సర్వేక్షణ్లో గ్రేటర్ హైదరాబాద్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో అగ్రస్థానం పొందగా, స్వచ్ఛ కార్యక్రమాల్లో 27వ స్థానంలో నిలిచింది. అయితే 2018లో 4,041 నగరాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించగా 2019లో 5వేల నగరాల్లో చేపట్టనున్నారు. దేశంలోని నగరాలు, పట్టణాల మధ్య స్వచ్ఛ కార్యక్రమాలపై ఆరోగ్యకరమైన పోటీని నిర్వహించేందుకుగాను చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల వల్ల నగరాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత మెరుగవడంతో పాటు నగరవాసులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఏర్పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో ఉద్యమ రూపంలో ఈ క్రింది స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టాలని డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లను కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు.
నివాస ప్రాంతాల్లో స్వచ్ఛ కార్యక్రమాలు
నగరంలోని ఇంటింటి నుండి చెత్త సేకరణను 100 శాతం చేపట్టడంతో పాటు తడి, పొడి చెత్తను ఇంటివద్దే వేరుచేసి స్వచ్ఛ ఆటోలకు అందించాలి. స్వచ్ఛ ఆటోల ద్వారా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ట్రాన్స్ఫర్ స్టేషన్కు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛ కార్యక్రమాలపై కాలనీ, బస్తీవాసుల్లో చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. గార్బేజ్ను బహిరంగ ప్రదేశాల్లో వేయడాన్ని నిషేదించడం, రోడ్లపై చెత్తను కాల్చకుండా నిరోదించడం, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ, నాలాలు, చెరువుల్లో వ్యర్థాలను వేయడం నివారించడం తదితర అంశాలపై నగరవాసుల్లో పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. స్వచ్ఛ సర్వేక్షణ్-2019 పోస్టర్లను అన్ని ప్రధాన మార్గాల్లో ప్రదర్శించడం, ఎక్కడైతే బహిరంగ మూత్రవిసర్జన ప్రదేశాలు ఉంటాయో వాటిని గుర్తించి ఆయా ప్రదేశాల్లో వాల్ పెయింటింగ్లు, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు చేపట్లాలని కమిషనర్ ఆదేశించారు.
వ్యాపార ప్రాంతాల్లో స్వచ్ఛ కార్యక్రమాలు
వ్యాపార ప్రాంతాల్లో వంద శాతం దుకాణాల నుండి చెత్త సేకరణతోపాటు తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలి. ప్రతి షాపులో చెత్త డబ్బాలు స్వయంగా ఏర్పాటుచేసి స్వచ్ఛ ఆటోలకు పంపించడంతో పాటు ఆయా దుకాణదారులు బహిరంగంగా చెత్తను వేయకుండా చర్యలు చేపట్టాలి. వాణిజ్య, వ్యాపార ప్రాంతాల్లో ప్రతి వంద మీటర్లకు రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేకంగా డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలి. వంద కేజీలకుపైగా వ్యర్థాలను ఉత్పత్తిచేసే వ్యాపార సంస్థలన్నీ తప్పనిసరిగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. తడి, పొడి చెత్త వేరుచేయడం, స్వచ్ఛ సర్వేక్షణ్-2019, స్వచ్ఛ మంచ్, స్వచ్ఛత యాప్, స్వచ్ఛతపై అడిగే ప్రశ్నలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో దుకాణదారులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. వాణిజ్య, వ్యాపార మార్గాల్లో రోజుకు కనీసం రెండు సార్లు ఊడ్చడం ద్వారా పూర్తిగా పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 లక్ష్యాలను తెలియజేసే హౌర్డింగ్లు, బిల్బోర్డులు, వాల్ రైటింగ్లను నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రదర్శించాలని కమిషనర్ కోరారు.
గార్బేజ్ వర్నలబుల్ పాయింట్ల పై ప్రత్యేక చర్యలు
నగరంలో ఉన్న బహిరంగ చెత్త ప్రదేశాలను పూర్తిగా నివారించి ఆయా పరిసర ప్రాంతాల్లో వందశాతం ఇంటింటి చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ప్రతి బహిరంగ చెత్తవేసే ప్రాంతాలకు ఒక్కో ఇన్చార్జీ అధికారిని నియమించి ప్రతిరోజు ఆయా ప్రాంతాలను మానిటర్ చేసేవిధంగా చర్యలు చేపట్టాలి. ప్రతి జీవీపీ వద్ద పరిశుభ్రతను తెలిపేవిధంగా వాల్పెయింటింగ్లు, ప్లాంటేషన్, రంగోళిలను వేయాలని కమిషనర్ ఆదేశించారు.
పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ
నగరంలోని పబ్లిక్ టాయిలెట్లన్నింటిని ఉదయం 4గంటల నుండి రాత్రి 10గంటల వరకు తెరిచి ఉండేలా చర్యలు చేపట్టాలి. టాయిలెట్లన్నింటిని పూర్తిస్థాయిలో మరమ్మతులు, కలరింగ్ చేయించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. మహిళలకు, పురుషులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు నిరంతరంగా నీటి సౌకర్యం ఉండాలి. ప్రతి టాయిలెట్ వద్ద కేర్టేకర్ తగు డ్రెస్కోడ్తో ఉండడంతో పాటు టాయిలెట్ల నిర్వహణపై ప్రజాస్పందన సేకరించేలా చర్యలు చేపట్టాలి. చిన్న పిల్లలకు సౌకర్యవంతంగా ఉండేందుకు తక్కువ ఎత్తు గల యూరినల్ సీట్ ఏర్పాటు, దివ్యాంగులకు ర్యాంప్లను ఏర్పాటు చేయాలి. ప్రతి టాయిలెట్లో సబ్బులు, మిర్రర్ ఏర్పాటు చేయడంతో పాటు ఫిర్యాదుల రిజిస్టర్, ఇన్చార్జి అధికారుల పేర్లు ప్రదర్శించాలి. నగరంలోని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా టాయిలెట్ ఉండేలా చర్యలు చేపట్టాలి. 25మందికిపైగా కార్మికులు ఉన్న ప్రతి నిర్మాణ ప్రాంతాల్లో కచ్చితంగా టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించాలి.
భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ
నగరంలో ఎక్కడ కూడా భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చర్యలు చేపట్టాలి. రోడ్లపై నిర్మాణ వ్యర్థాలు బహిరంగంగా వేసేవారిని గుర్తించి వారికి జరిమానాలు విధించాలి. పరిశుభ్రంగా ఉంచడంతోపాటు డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకునేవిధంగా చర్యలు చేపట్టాలి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో బహిరంగ చెత్తను వేయకుండా చర్యలు చేపట్టాలి. స్వచ్ఛ సర్వేక్షణ్పై అడిగే ఆరు ప్రశ్నల పట్ల నగరవాసులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి.