Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలు పాటించని నిర్వాహకులపై కేసులు
- ప్రయాణికుల భద్రతను గాలికొదిలిన వైనం
- 10 రోజుల్లో 108 కేసులు..రూ.9.50 లక్షల జరిమాన
- ఈ నెల 31 వరకు ప్రత్యేక డ్రైవ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ నిర్వాహకులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. 10 రోజులుగా నగరవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్లో సుమారు వందకుపైగా బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు గుర్తించారు. ఎనిమిది బస్సులను సీజ్ చేశారు. మరో 108 బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రయివేటు ట్రావెల్స్ ఆగడాలపై ప్రత్యేక దృష్టిసారించిన రవాణాశాఖ ఈ స్పెషల్ డ్రైవ్ను మరో 10 రోజుల పాటు కొనసాగించనున్నట్టు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ (జేటీసీ) పాండురంగ నాయక్ తెలిపారు. ముంబరు, బెంగళూరు, నాగ్పూర్, విజయవాడ రూట్లల్లో తిరిగే బస్సులను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆరు టీంలను రంగంలోకి దింపారు. ఒక్కో టీమ్లో ముగ్గురు అధికారులు ఉన్నారు.
నగరం నుంచి ప్రతి రోజూ 500కుపైగా బస్సులు ఏపీ నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్నాయి. చాలా బస్సులు కాంట్రాక్ట్ క్యారియేజ్లు కింద నమోదు చేసుకొని స్టేజీ క్యారియేజ్ల కింద తిరుగుతున్నాయి. ప్రయాణికుల భద్రతకు సంబంధించి అనేక నిబంధనలను బస్సుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. బస్సుల్లో కనీసం ఫస్ట్ఎయిడ్ బాక్సులు, ఫైర్ డిస్టింగ్విష్ పరికరాలు ఉండడం లేదు. ఇలాంటి వాటిపై దృష్టి సారించిన ఆర్టీఏ అధికారులు ఇప్పటి వరకు సుమారు రూ.9.49 లక్షల వరకు జరిమానా విధించారు. ఈ నెల 11 నుంచి 22 వరకు గ్రేటర్లోని అన్ని జోన్ల వారిగా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ఈ ప్రత్యేక డ్రైవ్ను ఈనెల 31వరకు కొనసాగించాలని నిర్ణయించారు.