Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సూర్యా ధనుంజరు, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్, డాక్టర్ ధనుంజరు నాయక్ దంపతులను మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ బహుజన సాహిత్య అకాడమీ సావిత్రి బాయి ఫూలే, మహాత్మ జ్యోతిబాయి ఫూలే జాతీయ పురస్కారాలతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ బహుజన సాహిత్య అకాడమీ, హైదరాబాద్ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకష్ణ మాట్లాడుతూ... ఆ దంపతులు చేస్తున్న సామాజిక, సాహితీ సేవలను గుర్తించి ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్టు తెలిపారు. సూర్యా ధనుంజరు జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని తెలుగు భాష వైభవాన్ని తెలుపుతూ... పత్ర సమర్పణ చేయటమే కాక ఎన్నో పరిశోధనాత్మకమైన వ్యాసాలను పత్రికలలో ప్రచురించి భావి పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. ఇంకా తన మాతృ భాష 'బంజారా' పై పరిశోధనలు చేయడమే గాక నిఘంటువును కూడా రచిస్తున్నట్టు తెలిపారు. ధనుంజయ నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియాలజీ శాఖలో ఆచార్యులుగా, వాణిజ్య పన్నుల శాఖలో సహాయ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జియాలజీలోనూ, నల్సర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలోనూ రెండు డాక్టరేట్ డిగ్రీలను అందుకున్నట్టు తెలిపారు. ఇరువురు ఉజ్వల్ క్రియేషన్స్ అనే సాహిత్య సంస్థ, యాడి ట్రస్టుల ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి పూర్వ ఉపముఖ్యమంత్రి, తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, ప్రముఖ సాహితీవేత్తలు, వివిధ రంగాల్లో సేవ చేస్తున్న ప్రముఖులు పాల్గొన్నారు.