Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సర్వే నెం.348/1లో ప్రభుత్వ స్థలాలను కొంత మంది యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని, ఆ స్థలాలను కాపాడాలని వడ్డెర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం డివిజన్ పరిధి కూన మహలక్ష్మీనగర్, భూదేవి హిల్స్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి మండలాలకు చెందిన వీఆర్వో విజరుకుమార్, సర్వేయర్లు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని సదరు సర్వే నెం హద్దులను పరిశీలించారు. ఆ స్థలానికి సంబంధించిన లే అవుట్లను వడ్డెర సంఘం నాయకులు సంబంధిత అధికారులకు తమ పరిధిలోకి వస్తున్న స్థలం గురించి వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొందరు ఏండ్లుగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ఇటువంటి వారిపైచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై కుత్బుల్లాపూర్ మండల తహశీల్దార్ గౌతంకుమార్ బుధవారం సందర్శించి రిపోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తగిన న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు గుంజా మహంకాళీ, సాంబయ్య, పెద్ద హనుమంతు, చిన్న హనుమంతు, దుర్గయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.