Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ
- చార్మినార్ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ - ధూల్పేట్
జీహెచ్ఎంసీలో చెత్త తరలింపునకు చేసుకున్న రాంకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని జీహెచ్ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ, నాయకులు దేవయ్య డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ చెత్త తొలగింపు, ట్రాన్స్పోర్ట్, సాలిడ్ వేస్ట్ నిర్వహణకు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలోని నాగోల్, యూసుఫ్ గూడ, పటాన్ చెరు ప్రాంతాల్లో చెత్త తరలింపు, సాలిడ్వేస్ట్ మెనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ పనులను రాంకీ సంస్థకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకించారు. దీంతో జీహెచ్ఎంసీ ఉద్యగ, కార్మికులతో పాటు జీహెచ్ఎంసీకి ప్రమాదం వాటిల్లుతుందన్నారు. 2007లో నాటి రాష్ట్ర ప్రభుత్వం రాంకీతో చేసుకున్న ఒప్పందాన్ని సంఘాలన్నీ వ్యతిరేకించడంతో అమలు చేయలేదన్నారు. జీహెచ్ఎంసీలో పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది ఉన్నారని, అయినా రాంకీతో ఒప్పందం చేయడం సరికాదన్నారు. రాంకీతో సహ ఏ ప్రయివేటు సంస్థ అయిన లాభాలే తప్ప పని ఉండదన్నారు. లాభాలే వారి పరమావధి అని చెప్పారు. జీహెచ్ఎంసీ ఇన్ఫ్రాస్టక్చర్, విలువైన భూములను, యంత్రాలను 'రాంకీ'కి అప్పగించడం అంటే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. రాంకీ ఎన్విరోతో జీహెచ్ఎంసీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయ్యాలని, జీహెచ్ఎంసీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేనిచో జీహెచ్ఎంసీ సంస్థ ఉనికికే ప్రమాదకరమని, ఈ రాంకీ ఒప్పందాన్ని ఉపసంహరించుకో వాలని డిమాండ్ చేశారు. ఒప్పదం రద్దు చేసుకోకపోతే కార్మిక ఉద్యోగులతో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఇ.అంజయ్య, భరత్, ప్రసాద్, ఎస్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.