Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కంటోన్మెంట్
కంటోన్మెంట్కు చెందిన కమ్యూనిటీ హాల్ ఒకప్పుడు తిరుమలగిరి వాసుల అన్ని శుభకార్యాలు, ఫంక్షన్స్కు ఉపయోగపడేది. వేలాది కుటుంబాలకు చెందిన వారి పిల్లల వివాహాలకు దీనిని వినియోగించేవారు. కానీ నేడది కలతప్పిపోయి చెత్త డంపింగ్కు కేంద్రంగా మారింది. ప్రజావసరాలకు పనికి వచ్చే ఈ కమ్యూనిటీ హాల్ను బోర్డు అధికారులే అత్యుత్సాహంతో తొలగించి చివరికి దానిని చెత్త డంపింగ్ యార్డుగా మార్చివేశారు. వివరాల్లోకెళ్తే.. కంటోన్మెంట్ పరిధిలో కాలనీవాసులు పోగుచేసే చెత్తను డంప్ చేయడానికి స్థలం లేకపోవడంతో, కంటోన్మేంట్ బోర్డు అధికారులు కమ్యూనిటీహాల్ను డంపింగ్ కేంద్రంగా మార్చివేశారు. ఇంతకు ముందు బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డుల చెత్తను హస్మత్పేట ట్రిన్షింగ్ గ్రౌండ్లో డంప్ చేసేవారు. అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో అన్నానగర్ మైదానంలో కొంత కాలం ఆ చెత్తను డంపింగ్ చేశారు. అక్కడ కూడా ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో తిరిగి ఏటా రూ. కోట్లు వెచ్చించి జీహెచ్ఎంసీతో ఒప్పందం కుదుర్చుకొని, జవహర్నగర్లో కొంత కాలం చెత్తను తరలించారు. అక్కడ కూడా స్థానికులు, ప్రజాప్రతినిధులు ధర్నా చేసి చెత్త డంపింగ్ను నిరాకరించడంతో, చేసేది ఏమీ లేక కొత్త ఆలోచనను తెర మీదకు తెచ్చారు. జీహెచ్ఎంసీకి డబ్బులు ఎందుకు ఇవ్వాలనే ఆలోచనతో ..కంటోన్మెంట్లోనే చెత్త రీసైక్లింగ్ కార్మాగారం ప్రారంభించాలని నిర్ణయించారు. తద్వారా చెత్తను తీసుకెళ్లేందుకు జీహెచ్ఎంసీకు ఇచ్చే డబ్బులు కూడా మిగులుతాయని, పైగా రీ సైక్లింగ్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువుతో బోర్డుకు డబ్బు వస్తుందని ఆలోచించారు. అనంతరం వెంటనే చెత్తను శుద్ధి చేసే కార్మాగారాన్ని నెలకొల్పాలని తీర్మాణించారు. అందుకు కేంద్రం నుంచి రూ.50 కోట్ల సాయం వస్తుందని, కంటోన్మెంట్ బోర్డు ఒక్క పైసా కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేదనుకుని, వెంటనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీకి కాంట్రాక్టు పనుల కోసం సంప్రదింపులు జరిపారు. దీనిలో భాగంగానే మూడేండ్ల కిందట గాంధీ కమ్యూనిటీ హాల్ను బోర్డు అధికారులు అత్యుత్సాహంతో రేకులు పీకేసి,బండలు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చెత్త డంపింగ్ యార్డు, కార్మాగారా న్ని వ్యతిరేకించారు. డంప్యార్డు ఏర్పాటుపై బోర్డులో తర్జమభర్జనలు పడి చివరికి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ కంపెనీ కాస్త ఉత్తరప్రదేశ్కు వెళ్ళిపోయింది. దీంతో కమ్యూనిటీ హాల్ అటూ ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. చివరికి రీసైక్లింగ్ కేంద్రం కాస్త చెత్త డంపింగ్ యార్డుగా మారిపోయింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవు తున్నారు. ప్రజా ప్రయోజనం కోసం 1987లో అప్పటి పాలకమండలి సభ్యులు తిరుమలగిరి చౌరస్తాలో గాంధీ పేరిట కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిపారు. ఈ నిర్మాణం అప్పట్లో వేలాది మంది పేద ప్రజలకు ఉపయోగప డింది. ప్రస్తుతం అధికారుల అనాలోచిత నిర్ణయాల వలన కమ్యూనిటీ హాల్ లేక స్థానికులు ఏ కార్యక్రమాలను జరుపులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా బోర్డు అధికారులు స్పందించి కాలనీ వాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ హాల్ను తిరిగి ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. కంటోన్మేంట్లో రీసైక్లింగ్ కార్మాగారం చేజారిపోగా.. ఉన్న కమ్యూనిటీ కూడా పోవడంతో ప్రజలు చింతిస్తున్నారు.